ఎవరు కాదన్నా, అవునన్నా… ప్రస్తుతం నడుస్తున్నరాజకీయాల్లో ప్రసార మాధ్యమాలు పోషిస్తున్న పాత్రను తక్కువ చేసి చూడలేం. అధికారంలో ఉన్న పార్టీలు తమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా, విపక్షాలు చేసే ప్రభుత్వ వ్యతిరేకపోరాటాలు విజయవంతం కావాలన్నామీడియా సహకారం అత్యవసరంగా మారిపోయిందిప్పుడు.
ఇప్పటికీ పత్రికల హవా తగ్గకున్నా… ప్రజల మీద ప్రభావం చూపించే మీడియా మాధ్యమాల్లో టీవీ ఛానళ్లు మరింత కీలకంగా మారిపోయిన సంగతి కూడా గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నా అది విద్యావంతులకు మాత్రమే పరిమితం కావడంతో దానికి కొన్ని పరిమితులున్నాయి. కానీ.. టీవీ ఛానళ్లకు అలా కాదు. కొత్తగా వచ్చేసిన స్మార్ట్ ఫోన్లు.. 4జీ నెట్ వర్క్ పుణ్యమా అని.. ఎక్కడున్నా అనుక్షణం టీవీ కార్యక్రమాలు చూడగలిగే అవకాశం వచ్చేసింది.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఇప్పుడు ఏపీ రాజకీయ నేతలకు మీడియాతో ఓ పెద్ద సమస్యే వచ్చింది. ప్రధాన తెలుగు పత్రికలతో పాటుగా ముఖ్యమైన టీవీ ఛానళ్లకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలన్నీ మొత్తం హైదరాబాద్ లోనే నెలకొనిఉన్నాయి. ఈ నేపథ్యంలో ఛానళ్లలో వివిధ అంశాలపై.. నిత్యం జరిగే ప్రధాన చర్చల్లో ఏపీకి సరైన ప్రాధాన్యత.. ప్రాథమ్యాలు దక్కటం లేదన్న అభిప్రాయం ఏపీ అధికారపక్షంలో ప్రస్తుతం గట్టిగానే వ్యక్తమవుతోంది.
ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ.. మంత్రివర్గంలోని నేతలతో జరిపిన సమావేశంలో హైదరాబాద్ లో ఉన్న టీవీ ఛానళ్లపై ఆసక్తికర చర్చ నడిచినట్లు సమాచారం. టీవీ ఛానళ్ల ఆఫీసులు మొత్తం హైదరాబాద్ లోనే ఉండిపోయాయని.. దీంతో… అవి నిర్వహించే టీవీ ఛానళ్ల చర్చల్లో ఏపీ నేతలు పాల్గొనలేకపోతున్న విషయాన్ని పార్టీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ప్రధాన టీవీ ఛానళ్లు విజయవాడలో కూడా తమ స్టూడియోలు ఏర్పాటు చేసుకోవాలన్న అంశాన్ని ఆయా యాజమాన్యాల దృష్టికి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రికి చెప్పినట్టు తెలుస్తోంది.
ఈ విషయంలో బుచ్చయ్యచౌదరి సలహాకు పార్టీ నేతలనుంచి గట్టి మద్ధతే లభించినట్టు సమాచారం. ఛానళ్లను బెజవాడకు ఆహ్వానించాలన్న నేతల మాటపై ముఖ్యమంత్రి సీరియస్ గా దృష్టి పెడితే మాత్రం.. త్వరలోనే అన్ని టీవీ ఛానళ్లు బెజవాడలోనో.. అమరావతిలోనో తమ స్టూడియోలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. టీవీ ఛానళ్లకు ఇది అదనపు వ్యయమే కావచ్చుగాని విభజన నేపథ్యంలో ఇది తప్పనిసరి పరిణామమేనని చెప్పాలి.