వర్తమాన రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ఉండటం కంటే… ప్రజలను ఏ స్థాయిలో నమ్మించగలమనేదానిపైనే తమ రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంటుందన్నది అధిక శాతం రాజకీయ నాయకుల నమ్మకం. అందుకే మీడియాలో రాజకీయ నేతల ముఖాముఖి చర్చల్లో దాదాపు మాటల యుద్ధమే జరుగుతోంది. ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శల చేసే విషయంలో కొందరు నేతలైతే అన్నిహద్దులను ఎప్పుడో దాటేశారు. తమ నోటి దురుసుతో ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతల వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న తీరు జుగుప్స కలిగిస్తోంది.
ఇక తనను తాను ఫైర్ బ్రాండ్ రాజకీయనాయకురాలిగా భావించుకునే వైసీపీ మహిళా నేత, నగరి ఎమ్మెల్యే ఆర్.కే. రోజా అయితే టీడీపీ నేతలపై అవకాశం వస్తే చాలు తనదైన శైలితో విరుచుకుపడుతున్నారు. లోటస్ పాండ్ నుంచి పార్టీ ప్రతినిధిగా ఆమె మీడియాతో మాట్లాడుతున్న మాటలు సొంత పార్టీ నేతలకు ఆనందాన్ని కలిగిస్తున్నాయేమోగాని, సామాన్యజనాన్ని ముక్కున వేలేసుకునేలా ఒక్కోసారి చెవులు మూసుకోవాలనిపించేలా ఉంటున్నాయి. సదా తమ అధినేత జగన్ కళ్ళలో ఆనందం చూడటానికి పరితపించే రోజా.. తాజాగా మరోసారి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్, మంత్రి దేవినేని ఉమా పై నోరు పారేసుకున్నారు.
సినిమా నటిగా మంచి నేపథ్యమే ఉన్న రోజా సీఎం తనయుడు నారా లోకేష్ ను విమర్శించడానికి రోజా తన రాజకీయ విమర్శలకు మహేష్ బాబు సినిమాలోని పంచ్ డైలాగులను వాడుకుని మరీ రెచ్చిపోయి విమర్శించారు. ‘ఆగడు’ సినిమాలో మహేష్ చెప్పిన ఓ డైలాగ్ ‘డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపుముందుకొచ్చి తొడకొట్టిందట’ అంటూ జగన్ని చికెన్ షాపుతోను లోకేష్ను కోడితోను పోల్చి రోజా డైలాగులు వల్లించేశారు. ఇంతకీ జగన్ కు భవిష్యత్తులో లోకేష్ రాజకీయ ప్రత్యర్థి కాబోతుండటంతో లోకేష్ స్థాయిని మీడియాలో తమ శక్తి మేరకు తగ్గించి చూపడం ఇప్పుడు వైసీపీ నేతల ప్రథమ లక్ష్యంగా మారిపోయినట్టు రోజా విమర్శలు స్పష్టం చేస్తున్నాయి. లోకేష్ సిమ్ కార్డ్ లేని సెల్ఫోన్ అని, చంద్రబాబు బ్లాక్ మెయిల్ కు బ్రాండ్ అంబాసిడర్ అని, చీటింగ్ కి చీర్ గర్ల్ లాంటివాడని తన సినిమా పరిజ్ఞానమంతా ఉపయోగించి రోజా ప్రాసలతో చెలరేగిపోయారు. పనిలో పనిగా మంత్రి దేవినేని ఉమా పై కూడా రోజా తీవ్ర విమర్శలు చేశారు.
రోజా వ్యాఖ్యలని టీడీపీ అధిష్ఠానం ఏ మాత్రం పట్టించుకోకుండా తేలిగ్గా కొట్టిపారేస్తోంది. ఆమె చౌకబారు వ్యాఖ్యలపై స్పందిస్తే అనవసరంగా ఆమెకు స్థాయికి మించిన ప్రాధాన్యం ఇచ్చినట్టేనని, అసలు సీఎంను, లోకేష్ను మంత్రులను విమర్శించే స్థాయి ఆమెకు ఉందా…? అని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో టీడీపీ లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు పొందేందుకు వై.స్. రాజశేఖర్ రెడ్డి, చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై ఆమె ఏవిధంగా మాట్లాడిందీ వారు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ లో చేరి జగన్ దగ్గర మార్కులు కొట్టేసేందుకు, తనకు పార్టీలో ప్రాధాన్యం పెంచుకునేందుకు ఆమె శిఖండిలా వ్యవహరిస్తోందని, ఆమె ఆ పార్టీకి పెయిడ్ వర్కర్ లా పని చేస్తున్నారని, అలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంట మంచిదని టీడీపీ నేతలు అంటున్నారు.