రాజకీయపార్టీగా అవిర్భవించినా ఇప్పటిదాకా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించని జనసేన పార్టీ తొలిసారిగా ఎన్నికల గోదాలోకి దిగబోతోందా..? ఆ పార్టీ రాజకీయ తొలి రాజకీయ ప్రత్యక్ష పోరుకు జీవీఎంసీ ఎన్నికలు వేదిక కాబోతోన్నాయా..? ఈ వార్తలు నిజమేనా…? లేక ప్రస్తుతానికి ఊహాగానాలేనా..? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం ప్రస్తుతం.. ఏపీలో చాలామందికి ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
విషయమేమిటంటే మహా నగరపాలక సంస్థ(జీవీఎంసీ) ఎన్నికలపై జనసేన పార్టీ గురిపెట్టిందని తాజాగా రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ హైదరాబాద్లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేయాలని పార్టీపై ఒత్తిడి పెరుగుతోందని పేర్కొనడంతో ఈ వార్తలు ఊహాగానాలు కావని తేలిపోయింది. అయితే జనసేన సొంతంగానే పోటీ చేస్తుందా..? లేక పొత్తులతో బరిలోకి దిగుతుందా… అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. అయితే పవన్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి తన సత్తా చూపించాలని ఉవ్విళ్లూరుతున్న ఆయన అభిమానుల్లో మాత్రం ఈ వార్తలు మంచి ఉత్సాహాన్ని నింపాయనే చెప్పాలి.. పవన్కల్యాణ్ వ్యాఖ్యలు నగరవాసుల్లో చర్చకు దారితీయడంతోపాటు ఆయన అభిమానాలు, పార్టీ కార్యకర్తల్లో మంచి ఉత్సాహాన్ని నింపాయి.
తెలుగు రాష్ట్రాల్లో తిరుగులేని అభిమాన గణం ఉన్న పవర్స్టార్ పవన్కల్యాణ్ జనసేన పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించి సరిగ్గా రెండున్నరేళ్లు గడిచింది. నాటి సాధారణ ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని అంతా భావించినా, పార్టీ నిర్మాణం పూర్తిగా జరగనందున బీజేపీ-టీడీపీ కూటమికి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. అప్పటినుంచి అడపా తడపా రాజకీయ ప్రకటనలు తప్ప ఇటీవలి కాలం వరకు ఆయన రాజకీయ లక్ష్యం ఏమిటో బయటపెట్టలేదనే చెప్పాలి. అయితే కొద్దిరోజుల క్రితం తిరుపతి, అ తరువాత కాకినాడలో బహిరంగ సభలు పెట్టిన పవన్ కల్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి తన పార్టీ సిద్ధమవుతోందనే సంకేతాలను ప్రజల్లోకి పంపారు.
ఇదిలా ఉండగా.. శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో.. త్వరలో జరగబోయే విశాఖతోపాటు మిగిలిన కార్పొరేషన్ల ఎన్నికల్లో పోటీ చేయాలని తనపై ఒత్తిడి వస్తున్నదని పవన్కల్యాణ్ పేర్కొనడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఒకేసారి సాధారణ ఎన్నికల బరిలో దిగడంకంటే, అంతకు ముందు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో క్రమంగా పార్టీ క్యాడర్ ఏర్పరచుకోవడం, పార్టీని బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నించడం మేలని పవన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విశాఖ నగరంలో జనసేన కార్యకర్తలు, పవన్కల్యాణ్ అభిమానులు కొద్ది రోజుల నుంచి తరచూ ఏదో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పవన్కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీ జయంతి రోజున కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఇవన్నీ ఆ పార్టీ ప్రజల్లోకి రావడానికి ప్రయత్నిస్తుందనేందుకు సూచనలుగానే భావిస్తున్నారు.
కాగా జనసేన ఒంటరిగానే స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తుందా… లేక ఇప్పటిదాకా మిత్రపక్షాలుగా ఉన్న టీడీపీ, బీజేపీలతో పొత్తులతో బరిలోకి దిగుతుందా… అనే అంశం ప్రస్తుతం ఆసక్తి కలిగిస్తోంది.. వైసీపీతో జట్టుకట్టే అవకాశం లేదని మాత్రం ఆ పార్టీ అభిమానులు పేర్కొంటుండటం ఇక్కడ గమనార్హం. ఇదే సమయంలో మేయర్ పదవికి ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతుండడం ఈ అంశంలో మరింత గందరగోళానికి తావిస్తోంది.
రాజకీయ సమీకరణల ప్రకారం.. కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న విశాఖ, కాకినాడ, గుంటూరు స్థానాల్లో పార్టీకి మంచి అవకాశాలున్నట్టు పవన్ కు సన్నిహితులు చెపుతున్నట్టు తెలుస్తోంది. మరి మిత్ర పక్షాలతో పొత్తు ఉండే పక్షంలో ఈ స్థానాలను తమ పార్టీకి ఇవ్వాలని పవన్ కోరే అవకాశముందా అనే అంశంపై కూడా రాజకీయ వర్గాల్లో తాజాగా చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఏపీ భవిష్యత్ రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉండబోతుందో జీవీఎంసీ ఎన్నికలు చూశాక తేలిపోనున్నదన్నమాట.