తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులో బీటెక్ అమ్మాయి రమ్య ఓ ఉన్మాది చేతిలో స్వాతంత్ర్య దినోత్సవం రోజే దారుణ హత్యకు గురి కావడం బాధాకరం. ఈ ఉదంతంలో రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం కూడా విద్యార్థిని కుటుంబానికి రూ.10 లక్షలు పరిహారం చెల్లించి, నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు గుంటూరులో ఆందోళనకు దిగారు. టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సాధారణంగా పెద్ద నిరసన కార్యక్రమాలు జరిగితే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చేవారు. అయితే ఈసారి ఆయన కుమారుడు లోకేష్ రంగంలోకి దిగారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. వారి బాధలు విన్నారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. తమకు డబ్బు అవసరం లేదని, న్యాయం చేయాలని రమ్య తల్లిదండ్రులు చెప్పారన్నారు. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు అధిక సంఖ్యలో గుమిగూడటం, రమ్య భౌతిక కాయంతోనే ధర్నా చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా లోకేష్, ఇతర నాయకులను అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా ఇంతవరకు లోకేష్ అరెస్టు అనే పదం ఎరుగరు. ఈ రోజు అదీ జరగిపోయింది. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అని టీడీపీ నాయకులు ప్రభుత్వాన్ని రాష్ర్టవ్యాప్తంగా కడిగిపారేస్తున్నారు. రమ్య కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు ఆందోళనలు చేస్తామని ప్రకటించారు.
విమర్శలు పాలవుతున్న పోలీసు చర్యలు
హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీతోపాటు ఇతర పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తారనేది పోలీసులకు తెలుసు. ఈ నేపథ్యంలో బాధితురాలిని పరామర్శిస్తారని ముందుగానే ఊహించవచ్చు. ఆ ప్రాంతంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసి గొడవలు లేకుండా చూడవచ్చు కానీ.. అలా చేయలేదు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చినా పకడ్బందీ చర్యలు తీసుకుంటే సరిపోయేది. అలా కాకుండా అరెస్టులు చేయడం, నాయకులను ఈడ్చుకుంటూ వెళ్లడం లాంటివి చేస్తే పోలీసులపై దురభిప్రాయం ఏర్పడుతుంది.