గత నెలలో విడుదలైన `జైలర్` సినిమా గ్రాండ్ విక్టరీ సాధించిన సంగతి తెలిసిందే. దర్శకనిర్మాతలు కూడా ఊహించని రేంజ్ లో ఈ సినిమా హిట్ అయింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. 700 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సాధించి రికార్డులు తిరగరాసింది. జైలర్ సాధించిన విజయంతో ఫుల్ ఖుషీలో ఉన్న నిర్మాత కళానిధి మారన్.. చిత్ర టీమ్కు అదిరిపోయే సర్ప్రైజ్ లు ఇస్తున్నారు.
ఇప్పటికే హీరో రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్లకు లాభాల్లో కొంత వాటాతో పాటు ఖరీదైన కార్లను గిఫ్ట్ గా ఇచ్చారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కు కూడా కాస్ట్లీ కారును బహుమతిగా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఇక తాజాగా కళానిధి మారన్ ఉపాసన తాతయ్యకు కోటి రూపాయిల చెక్ అందించారు. ఉపాసన తాతయ్య మరెవరో కాదు అపోలో హస్పిటల్స్ చెర్మెన్ డాక్టర్ ప్రతాప్ రెడ్డి.
అయితే జైలర్ సినిమాతో వచ్చిన లాభాల్లో కొంత మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాల కోసం వినియోగించాలని మారన్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే కోటి రూపాయిలను అపోలో ఆస్పత్రికి డొనేట్ చేశారు. మారన్ సతీమణి కావేరి అపోలో హాస్పిటల్స్ చైర్మన్, డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డిని కలిసి చెక్ అందించారు. 100 మంది నిరుపేద పిల్లల గుండె శస్త్రచికిత్సల కోసం ఈ విరాళం మొత్తాన్ని ఉపయోగించబోతున్నారు. దీంతో మారన్ మంచి మనసుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.