గన్నవరంలో తమ్ముళ్ళ రచ్చ..వంశీ టార్గెట్ గానే.!

గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టార్గెట్ గానే లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతుంది. టి‌డి‌పి నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళి..చంద్రబాబు, లోకేష్ లపై విరుచుకుపడుతున్న వంశీని ఓడించాలని టి‌డి‌పి శ్రేణులు కసిగా ఉన్నాయి. ఈ క్రమంలో గన్నవరంలో లోకేష్ పాదయాత్ర ఎంటర్ అవ్వడమే తెలుగు తమ్ముళ్ళు భారీ స్థాయిలో పాదయాత్రలో కనిపించారు. అటు గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావుకు లోకేష్ టి‌డి‌పి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

యార్లగడ్డ సైతం..లోకేష్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. అర్ధరాత్రి 12 గంటల వరకు లోకేష్ పాదయాత్ర సాగింది. అలాగే 22వ తేదీన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే పాదయాత్ర సమయంలో తమ్ముళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించారు. వాస్తవానికి లోకేష్ పాదయాత్ర గన్నవరం టౌన్ లో కొనసాగాలి..కానీ కావాలని వంశీ పార్టీ ఆఫీసు నుంచి పాదయాత్ర రావాలని తమ్ముళ్ళు పట్టుబట్టారు. ఈ క్రమంలో పోలీసులు పెద్ద ఎత్తున చేరుకుని వంశీ ఆఫీసుకు వెళ్ళే రోడ్డుని మూసివేశారు. కరెంట్ కూడా తీసేశారు.

అటు పాదయాత్ర రూట్ మ్యాప్ లేదని చెప్పిన తమ్ముళ్ళు తగ్గలేదు. చివరికి లోకేష్ కల్పించుకుని వైసీపీ శ్రేణులు రెచ్చగొడతాయని, ఆ ఉచ్చులో పడవద్దని చెబుతూ..యథావిధిగా గన్నవరం టౌన్ లో పాదయాత్ర కొనసాగించారు. అంటే కావాలని వంశీని తెలుగు తమ్ముళ్ళు రెచ్చగొడుతున్నారనే చెప్పాలి.

ఆయనని కావాలని టార్గెట్ చేసి రాజకీయంగా మళ్ళీ ఏమైనా రచ్చ జరిగితే వైసీపీపై తోసేయాలని చూశారు. ఇక సభ సమయంలో తమ్ముళ్ళు ఏం చేస్తారో చూడాలి.