రూ.5 వేల కోట్ల వసూళ్లను సలార్ మూవీ సాధిస్తుందా.. టీజర్‌తో పెరుగుతున్న అంచనాలు

ప్రభాస్ అభిమానులు ప్రస్తుతం సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2లతో దేశవ్యాప్తంగా ఎంతో మంది మెచ్చే హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా బాహుబలి 2కి రూ.1800ల కోట్ల భారీ వసూళ్లు దక్కాయి. తర్వాత ఆ స్థాయి వసూళ్లు వచ్చే సినిమా ఏదీ ప్రభాస్ నుంచి రాలేదు. అయితే ప్రస్తుతం కేజీఎఫ్ చిత్రాన్ని తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నాడు. దీనికి సంబంధించిన టీజర్ గురువారం రిలీజ్ అయింది. అందులో ప్రభాస్ లుక్, సినిమా నిర్మాణ విలువలు, విలన్‌గా పృథ్వీరాజ్ సుకుమారన్‌ను చూసి ఇక ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్‌గా నిలుస్తుందనే వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ అభిమానులు ఆ టీజర్ చూసి చాలా సంతోషంగా ఉన్నారు. ‘సలార్’ నిర్మాతలు టీజర్‌ను విడుదల చేశారు. పవర్‌ఫుల్ స్టిల్స్, ఇంట్రెస్టింగ్ యాక్షన్‌కు తక్కువ ఏమీ లేదు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. సెప్టెంబర్ 28, 2023న థియేటర్లలో విడుదల కానుంది. తాజాగా విడుదల అయిన ఈ టీజర్ సంచలనాలు సృష్టిస్తోంది.

రెండు నిమిషాల కంటే తక్కువ నిడివిగల టీజర్, ప్రముఖ నటుడు టిన్ను ఆనంద్ నిర్భయమైన అవతారంలో, ఆయుధాలు ధరించిన వ్యక్తులు అతనిపైకి తుపాకీలను గురిపెట్టి ఉండటంతో ప్రారంభమవుతుంది. ఈ సన్నివేశం ఆఫ్రికాలో తీసినట్లు అర్ధం అవుతోంది. ఆనంద్ తన లొంగని వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తూ, దుండగులతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడతాడు. టీజర్‌లో ప్రభాస్‌ను పరిచయం చేస్తూ, అతని పాత్ర అడవికి రాజుగా ఉంది. ప్రభాస్ భీకర పోరాటంలో పాల్గొంటూ, బాకు ఆకారపు కత్తిని పట్టుకుని, రక్తంతో తడిసిన పంచ్‌తో తన తీవ్రమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు. మరో వైపు పృథ్వీరాజ్ సుకుమారన్ నుదుటిపై సాంప్రదాయిక బొట్టుతో ఉన్న సన్నివేశం ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుంది. టీజర్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.


సలార్ టీజర్ ప్రభావాన్ని వివరిస్తూ “గూస్‌బంప్స్” వస్తున్నాయని పేర్కొంటున్నారు. భారతదేశం, యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో సహా వివిధ ప్రదేశాలలో చిత్రీకరించబడిన ఈ చిత్రం అద్భుతమైన మాస్ యాక్షన్, అడ్వెంచర్ చిత్రంగా రూపొందింది. రూ.200 కోట్ల బడ్జెట్‌తో, నిర్మాణ బృందం విజువల్ ఎఫెక్ట్స్‌లో భారీగా పెట్టుబడి పెట్టింది. ఫారిన్ స్టూడియో సేవలను వినియోగించుకున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ నటించింది. జగపతి బాబు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా రూ.5 వేల కోట్లను సాధిస్తుందని ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు.