అభిమానులను కంగారు పెడుతున్న క్రేజీ కాంబో… అసలు విషయం ఏమిటంటే?

మహేష్ బాబు, త్రివిక్రమ్… ఒకరు సూపర్ స్టార్, మరొకరు మాటల మాంత్రికుడు. వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తున్నారంటే సినిమా ప్రేమికులకు పూనకాలే. ఇప్పుడు వీళ్లిద్దరు కలిసి చేస్తున్న చిత్రం “గుంటూరు కారం”. సినిమా ఏ ముహూర్తాన మొదలయిందో కానీ అన్ని సమస్యలే. అనేక అడ్డంకులతో సినిమా వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాకు ముందుగా మహేష్ బాబు సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా అనుకున్నారు. కానీ కొన్ని రోజుల క్రితం శ్రీలీల హీరోయిన్ అంటూ చిత్ర బృందం ప్రకటించింది. హీరోయిన్ మారిన కారణంగా కొన్ని సీనులు రీషూట్ చేస్తున్నారని సమాచారం. తాజాగా ఇప్పుడు ఈ చిత్రానికి పనిచేస్తున్న సినిమాటోగ్రాఫర్ కూడా తప్పుకున్నట్టు తెలుస్తోంది.

ఈ కాంబోకు సమస్యలు కొత్తేమి కాదండోయ్. త్రివిక్రమ్, మహేష్ బాబు కలిసి ఇంతకు ముందు రెండు చిత్రాలు చేసిన విషయం మనందరికీ తెలిసినదే. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం “అతడు”. ఈ చిత్రం 2005 లో విడుదలయింది. థియేటర్లలో పెద్దగా రాణించకపోయిన టీవీలో టెలికాస్ట్ అయ్యాక టీఆర్ఫీలో రికార్డులు సృష్టించింది. ఒక మంచి ఫామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఐతే కారణం ఏమిటో తెలీదు కానీ అప్పట్లో ఈ చిత్రం తెరకెక్కించడానికి రెండేళ్లు పట్టిందట.

వీళ్లిద్దరి కంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం “ఖలేజా”. ఈ చిత్రం 2010 లో విడుదలయింది. ఒక కొత్త కధాంశంతో, మహేష్ బాబు స్టైల్ కు తీసి భిన్నంగా ఒక ప్రయోగం చేశారనే చెప్పాలి త్రివిక్రమ్. ఈ చిత్రానిది కూడా అదే వరస. థియేటర్లలో పెద్దగా రాణించలేదు కానీ టీవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఏకంగా మూడేళ్లు తీసుకున్నారట మన మాటల మాంత్రికుడు. కాని ఈ రెండు సినిమాలు ఎన్నిసార్లు చూసిన ఇంకా ఫ్రెష్‌గానే ఉంటాయి. ముందు రెండు సినిమాలకు ఎలా జరిగిందో ఇప్పుడు గుంటూరు కారం విషయంలో కూడా అదే రిపీట్ అవుతోంది. ఈ సినిమాను 2024 సంక్రాంతి బరిలో దింపేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. మరి అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందో లేదో వేచి చూడాల్సిందే.