ప్రియా వారియర్ `బ్రో` ముచ్చ‌ట్లు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ అలా, సాయి ధ‌ర‌మ్ తేజ్ ఇలా!

మెగా ఫ్యాన్స్ ఎంతో ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్న చిత్రం `బ్రో`. ఇందులో మెగా హీరోలు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ క‌లిసి న‌టించారు. ద‌ర్శ‌క‌న‌టుడు స‌ముద్ర‌ఖ‌ని డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కేతిక శ‌ర్మ‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్లుగా న‌టించారు. కోలీవుడ్ సూప‌ర్ హిట్ `వినోద‌య సిత్తం`కు రీమేక్ ఇది. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాటులు, స్క్రీన్ ప్లే అందిస్తుంటే.. థ‌మ‌న్ స్వ‌రాలు స‌మ‌కూర్చుతున్నాడు.

జూలై 28న ఈ చిత్రం అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే మేక‌ర్స్ జోరుగా ప్ర‌మోష‌న్స్ నిర్వ‌హిస్తున్నారు. మ‌రోవైపు రీమేక్ మూవీ అయిన‌ప్ప‌టికీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క్రేజ్ దృష్ట్యా బ్రోకు భారీ స్థాయిలో బిజినెస్ జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా ప్రియా వారియ‌ర్ ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా బ్రో మూవీకి సంబంధించి ఎన్నో ముచ్చ‌ట్లు చెప్పుకొచ్చింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, తేజ్‌ల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది.

గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో త‌న పాత్ర కొత్తగా ఉంటుంద‌ని, హోమ్లీ గర్ల్ లాంటి క్యారెక్టర్ చేశాన‌ని ప్రియా వారియ‌ర్ పేర్కొంది. మాతృకతో పోలిస్తే బ్రో మూవీలో చాలా మార్పులు చేశార‌ని.. ప్రధాన తారాగణం అందరితోనూ త‌న‌కు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయ‌ని ఆమె తెలిపింది. అలాగే `ప‌వ‌న్ క‌ళ్యాణ్ సెట్స్ లో చాలా కామ్ గా ఉంటారు. కానీ ఆయన సెట్స్ లో అడుగుపెడితే మాత్రం అందరి లో ఉత్సాహం వస్తుంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది ఆయన త‌త్వం. ఆయ‌న నుంచి అదే నేర్చుకున్నా. ఇక సాయి ధ‌ర‌మ్ తేజ్ సెట్స్ లో ఎంతో సరదాగా ఉంటాడు. అంద‌రితో ఇట్టే క‌లిసిపోతాడు. షూటింగ్ సమయం లో మంచి ఫ్రెండ్స్ అయ్యాం` అని ప్రియా వారియ‌ర్ పేర్కొంది.