విడాకులపై నిహారిక స్పందన.. చైతన్య ఇచ్చిన రిప్లై ఇదే

విడాకులు అనేవి ఎవరి జీవితంలో అయినా ఊహించని ఘటన. చాలా మంది సినిమా నటులు వివాహాలు చేసుకోవడం, భాగస్వామితో విభేదాలతో విడిపోవడం వంటివి చూస్తున్నాం. అయితే ఎంతో సంతోషంగా ఉన్న కొన్ని జంటలు విడిపోతే అయ్యో అనుకుంటాం. ఇదే కోవలో గతంలో సమంత-నాగచైతన్య విడిపోయినప్పుడు చాలా మంది సినీ ప్రేక్షకులు బాధ పడ్డారు. వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. వారి తరహాలోనే మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక-జొన్నలగడ్డ చైతన్య దంపతులు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. ఆశ్చర్యకరంగా వీరు కూడా పెళ్లైన రెండేళ్లకే విడిపోయారు. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో వీరిద్దరికి జులై 4న విడాకులు మంజూరు అయ్యాయి. ఏప్రిల్ 1వ తేదీన వీరు పరస్పర అంగీకారంతో హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. చివరికి మూడు నెలలకు వీరికి విడాకులు మంజూరయ్యాయి. దీంతో డెస్టినేషన్ వెడ్డింగ్ టాలీవుడ్ నటులకు కలిసి రాలేదనే వాదన వినిపిస్తోంది. ఇక విడాకుల తర్వాత నిహారిక సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేసింది.


భర్త చైతన్యతో విడాకులు తర్వాత దానిపై నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్పందించింది. ‘చైతన్య, నేను పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకున్నాము. మేమిద్దరం వేర్వేరుగా ప్రారంభించే వ్యక్తిగత జీవితాలలో ప్రైవసీని కోరుకుంటున్నాం. ఈ సున్నితమైన విషయంలో ఎవరూ ఇబ్బంది పెట్టవద్దు. నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబం, స్నేహితులకు ధన్యవాదాలు. అర్ధం చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు’ అని పోస్ట్ చేసింది. దీని తర్వాత చైతన్య కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఇదే తరహాలో స్పందించాడు.

తామిద్దరం వేర్వేరుగా జీవితాలు ప్రారంభిస్తున్నామని, తమ లైఫ్‌కు ప్రైవసీ కావాలని ఆయన కోరారు. తనకు మద్దతుగా నిలిచిన పెద్దలు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. కొన్నాళ్ల క్రిందట వీరిద్దరూ తమ తమ పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించారు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. చివరికి ఊహాగానాలే నిజమయ్యాయి.