మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. మిస్టర్, అంతరిక్షం చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు. ఈ సినిమాల ఫలితం ఎలా ఉన్నా.. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మధ్య ఏర్పడ్డ స్నేహం ప్రేమగా మారింది. ఇప్పుడు వీరిద్దరూ పెళ్ళికి రెడీ అయ్యారు.
ఈరోజే హైదరాబాద్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరగబోతోంది. దీనిపై మెగా ఫ్యామిలీ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. అయితే వీరి నిశ్చితార్థానికి రాబోయే అతిథుల లిస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. మెగా ఫ్యామిలీ, లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొనబోతున్నారు.
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఇలా మెగా హీరోలందరూ వరుణ్-లావణ్య ఎంగేజ్మెంట్ లో సందడి చేయనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే వీరందరూ తాము చేస్తున్న ప్రాజెక్ట్ ల నుంచి బ్రేక్ తీసుకున్నారట. ఎంగేజ్మెంట్ పూర్తయ్యాక వివాహ తేదీని ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్ లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి ఉంటుందని సమాచారం. ఇక పెళ్లికి మాత్రం టాలీవుడ్ ప్రముఖులందరినీ ఆహ్వానిస్తారని అంటున్నారు.