ద్వారంపూడి టార్గెట్‌గా పవన్..జనసేన చెక్ పెడుతుందా?

ఏ ఎమ్మెల్యేపైన ఈ స్థాయిలో పవన్ కల్యాణ్ విరుచుకుపడలేదు. ప్రభుత్వ పరంగా విమర్శలు..కొందరు మంత్రులపై ఫైర్ అవ్వడం చేశారు గాని..ప్రత్యేకంగా ఒక ఎమ్మెల్యేని పవన్ ఎప్పుడు పెద్దగా టార్గెట్ చేయలేదు. కానీ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని మాత్రం ఓ రేంజ్ లో టార్గెట్ చేశారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. తాజాగా వారాహి యాత్రలో భాగంగా  “ ద్వారంపూడి నువ్వో డెకాయిట్‌.. కాకినాడను నువ్వు డ్రగ్స్‌ డెన్‌గా మార్చావు.. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తా.. నీ నేర సామ్రాజ్యం నేలకూలుస్తా. నీకు రోజులు దగ్గర పడ్డాయి జాగ్రత్త.. నిన్ను, సీఎం జగన్‌ని రోడ్డుకీడ్చుతా” అంటూ తీవ్రంగా ఫైర్ అయ్యారు.

ఈ నాలుగేళ్లలో ద్వారంపూడి కుటుంబం అక్రమ సంపాదన రూ.15వేల కోట్లు అని,  ఎక్కడైనా స్థలం కనిపిస్తే చాలు కబ్జాలకు పాల్పడడం, అడ్డొచ్చిన వారిపై దౌర్జన్యాలకు పాల్పడడం, గంజాయి సరఫరా, బియ్యం వ్యాపారంతో సంపాదించిన అక్రమార్జనతో బలిసి ఉన్నాడని, అతడి అక్రమాల చిట్టా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వద్ద ఉందిని,  జనసేన అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే తాతను బేడీలు వేసి జైలుకి పంపించిన అప్పటి ఎస్పీ డీటీ నాయక్‌లా తాను బీమ్లా నాయక్‌ ట్రీట్మెంట్‌ చూపి స్తానని,  ఎమ్మెల్యేను జైలుకు పంపి క్రిమినల్స్‌ని ఏరిపారేస్తానని,  ఏమూలకెళ్లినా అతడి అక్రమ బాగోతాలే బయటపడుతున్నాయని, ఖచ్చితంగా ద్వారంపూడిని రోడ్డుకు ఈడుస్తానని అన్నారు.

అయితే పవన్..ద్వారంపూడిని ఇంతలా టార్గెట్ చేయడం వెనుక కారణాలు ఉన్నాయి. గతంలో పవన్‌ని అకారణంగా ద్వారంపూడి పచ్చి బూతులు తిట్టారు. అలాగే పవన్‌ని తిట్టారని జనసేన శ్రేణులు, మహిళలు..ద్వారంపూడి ఇంటి వద్ద ఆందోళన చేస్తే వారిపై దాడి చేశారు. ఇక ఎప్పటికప్పుడు ద్వారంపూడి జనసేనని టార్గెట్ చేస్తూనే ఉన్నారు..అందుకే పవన్ ఇప్పుడు ఈ స్థాయిలో ద్వారంపూడిపై ఫైర్ అయ్యారు. కాకపోతే ద్వారంపూడిని ఓడించాలంటే జనసేనకు సాధ్యం కాదు. టి‌డి‌పి కలిస్తేనే సాధ్యం అవుతుంది.

గత ఎన్నికల్లో ద్వారంపూడి ఓట్లు చీలడం వల్లే గెలిచారు. గత ఎన్నికల్లో ద్వారంపూడికి 73 వేల ఓట్లు వస్తే..టి‌డి‌పికి 60 వేలు, జనసేనకు 30 వేల ఓట్లు వచ్చాయి. అంటే టి‌డి‌పి, జనసేన కలిస్తేనే ద్వారంపూడికి చెక్ పడుతుంది.