టాలీవుడ్ లో సెన్సేషన్ కపుల్ గా గుర్తింపు సంపాదించుకున్న నరేష్, పవిత్ర లోకేష్ కలిసి `మళ్లీ పెళ్లి` అంటూ ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్పై నరేష్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించారు. ఇందులో జయసుధ, శరత్ బాబు, వనితా విజయ్ కుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవి వర్మ, అన్నపూర్ణ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
మే 26న ఈ చిత్రం తెలుగుతో పాటు కన్నడలోనూ విడుదల అయింది. నరేష్, పవిత్రల నిజ జీవిత సంఘటనలనే `మళ్లీ పెళ్లి` గా సినిమా తీశారు. ఇది బయోపిక్ కాదని, రమ్య రఘుపతిపై రివేంజ్ తీర్చుకోవడానికి సినిమా తీయలేదని నరేష్ చెప్పారు. కానీ, మళ్లీ పెళ్లి ద్వారా నరేష్ రమ్య రఘుపతిపై గట్టిగానే రివేంజ్ తీర్చుకున్నాడు.
అయితే ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. టాక్ అనుకూలంగా లేకపోవడంతో.. వసూళ్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. రూ. 16 కోట్ల బడ్జెట్ పెడితే మూడు రోజుల్లో కనీసం పోస్టర్ ఖర్చులు కూడా రాలేదు. మొదటి రోజు రూ. 40 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా.. రెండవ రోజు రూ. 15 లక్షలు, మూడవ రోజు రూ. 12 లక్షల గ్రాస్ ని రాబట్టింది. అలా మూడు రోజులకు కలిపి రూ. 67 లక్షల గ్రాస్ ని సొంతం చేసుకుంది.