మరో అభ్యర్ధి ఫిక్స్..టీడీపీకి కలిసొస్తుందా?

టి‌డి‌పి అధినేత చంద్రబాబు దూకుడు మీద ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని పట్టుదలతో ఉన్నారు. ఈ సారి గాని అధికారంలోకి రాకపోతే పార్టీ పరిస్తితి ఇబ్బందుల్లో పడుతుంది. అందుకే ఖచ్చితంగా అధికారం సాధించడమే లక్ష్యంగా బాబు ముందుకెళుతున్నారు. ఈ క్రమంలో గతానికి భిన్నంగా బాబు..ముందుగానే అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు చేశారు.

ఈ క్రమంలోనే తాజాగా యర్రగొండపాలెంలో అభ్యర్ధిని ఫిక్స్ చేశారు. మామూలుగా వై పాలెంలో టి‌డి‌పికి పెద్ద పట్టు లేదు. గత మూడు ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి ఓడిపోతుంది. అయితే ఈ సారి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే పలు అభ్యర్ధులని మార్చారు గాని..ఈ సారి కొత్త ఇంచార్జ్‌ని పెట్టారు. ఎరిక్షన్ బాబుని ఇంచార్జ్ గా పెట్టారు. అక్కడ నుంచి పార్టీకి కాస్త ఊపు వచ్చింది. అయితే తాజాగా బాబు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ రోడ్ షో చేశారు.

ఇదే సమయంలో వై. పాలెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్..బాబుకు పోటీగా నిరసన తెలియజేశారు. ఇదే క్రమంలో బాబు కాన్వాయ్ పై వైసీపీ శ్రేణులు రాళ్ళ దాడి చేశారు. దీంతో బాబు సెక్యూరిటీకి కూడా గాయమైంది. ఈ అంశంపై బాబు సీరియస్ అయ్యారు..ఈ క్రమంలో బాబు..సురేష్‌కు ఛాలెంజ్ చేశారు. ‘ఇప్పుడు నేను చెప్తున్నా.. మా టీడీపీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గం నుంచి ఎరిక్షన్‌బాబు పోటీ చేస్తారు. ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసే ధైర్యం మీకుందో లేదో తేల్చుకోండి. మా పార్టీ తరపున ఎరిక్షన్‌బాబు అభ్యర్థి అని నేను ఇప్పుడే ప్రకటించా కదా.. నీవు మీ నాయకుడి వద్దకు వెళ్లి నీకు టిక్కెట్‌ ఇస్తాడో లేదో తేల్చుకో’ అని మంత్రి సురేష్ టార్గెట్ గా బాబు ఫైర్ అయ్యారు. అంటే వై పాలెం లో టి‌డి‌పి అభ్యర్ధిగా ఎరిక్షన్ బాబు ఫిక్స్ అయిపోయారు. మరి గెలుపు వస్తుందో లేదో చూడాలి.