`విరూపాక్ష‌` డైరెక్ట‌ర్ కార్తీక్‌ వ‌ర్మ బ్యాక్‌గ్రౌంట్ ఏంటి.. అత‌డి మొద‌టి సినిమా ఏదో తెలుసా?

గత వారం విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ `విరూపాక్ష`. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌, సంయుక్త మీన‌న్‌ జంటగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టిస్తోంది.

దీంతో ఈ మూవీని డైరెక్ట్ చేసిన‌ కార్తీక్ వర్మ గురించి పలు ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి. గ‌త‌ కొద్దిరోజుల నుంచి కార్తీక్ వర్మ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు, అత‌డికి ఇదే తొలి సినిమా అని ప్రచారం జరిగింది. కానీ అది నిజం కాదు. వైజాగ్ లో పుట్టిన పెరిగిన కార్తీక్ వ‌ర్మ‌.. ఉన్న‌త విద్య‌ను అభ్య‌సించాడు. అయితే సినిమాల‌పై ఉన్న మ‌క్కువ‌తో ఇండ‌స్ట్రీ వైపు అడుగు వేశాడు. కార్తీక్ దండు `భంభోలేనాథ్` అనే సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించాడు. అయితే ఆ సినిమా ఎప్పుడు వ‌చ్చిందో కూడా ప్రేక్ష‌కుల‌కు తెలియ‌దు.

 

ఆ త‌ర్వాత సాయి ధ‌ర‌మ్ తేజ్ హీరోగా తెర‌కెక్కిన `జ‌వాన్‌` మూవీకి కో రైట‌ర్‌గా ప‌ని చేశాడు. ఇక విరూపాక్ష కథ రాసుకొని దానికోసం ప్రొడ్యూసర్ ల వెంట తిరుగుతూ ఉన్న కార్తీక్ వ‌ర్మ‌.. ఓ రోజు ఒక నిర్మాత‌కు క‌థ నెరేట్ చేశాడు.ఆ నిర్మాత కాస్త.. డైరెక్టర్ సుకుమార్ కి స్నేహితుడట. దీంతో ఈ కథ సుకుమార్ దగ్గరకు చేరింది. కథ విని ఇంప్రెస్ అయిన సుకుమార్ స్క్రిప్ట్ రాయడానికి సహాయం చేశాడు. అలానే నిర్మాణంలోనూ భాగమయ్యాడు. సాయి ధ‌ర‌మ్ తేజ్ ను హీరోగా ఎంపిక చేసి సినిమా తీశాడు. క‌ట్ చేస్తూ విరూపాక్ష బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. రెండో సినిమాకే కార్తీక్ వ‌ర్మ అంద‌రి క‌ళ్ల‌లో ప‌డ్డాడు. మ‌రి ఈ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ హీరోతో ఉండ‌బోతుంది అన్న‌ది చూడాలి.