మెగా మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం `విరూపాక్ష` సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కార్తీక్ వర్మ దండు అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రముఖ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కథ అందించారు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బాపినీడు.బి సమర్పణలో బీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు అజనీష్ లోక్నాథ్ స్వరాలు అందించాడు. విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే హర్రర్ థ్రిల్లర్ ఇది. ఏప్రిల్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ లో భాగంగా సాయి ధరమ్ తేజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా సినిమాకు సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. అయితే పెళ్లి మరియు తన బ్రేకప్ గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. గతంలో ఓ అమ్మాయిని ప్రేమించానని.. కానీ, పలు కారణాల వల్ల బ్రేకప్ అయిందని తేజ్ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత అమ్మాయిలంటేనే భయమేస్తోందని అతడు పేర్కొన్నాడు. ఇక ఎవరి కోసమో తాను పెళ్లి చేసుకోనని.. నాకు నచ్చినప్పుడే చేసుకుంటానని తేజ్ స్పష్టం చేశాడు. దీంతో ఈయన వ్యాఖ్యలు కాస్త నెట్టింట వైరల్ గా మారాయి.