బైక్ యాక్సిడెంట్ త‌ర్వాత నాలో అది పూర్తిగా మారింది.. తేజ్ ఓపెన్ కామెంట్స్‌!

మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ 2021లో బైక్ యాక్సిడెంట్ కు గురైన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో సాయి ధ‌ర‌మ్ తేజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ యాక్సిడెంట్ నుంచి కోలుకుని మ‌ళ్లీ కెమెరా ముందుకు రావ‌డానికి తేజ్ ఎన్నో నెల‌లు తీసుకున్నాడు. ఫైన‌ల్ గా మ‌ళ్లీ సినిమాల‌తో బిజీ అయ్యాడు.

 

 

ప్రస్తుతం సాయిధరమ్‌ తేజ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో విరూపాక్ష ఒకటి. కార్తిక్‌ దండు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సంయుక్త మీన‌న్ ఇందులో హీరోయిన్. తాజాగా ఈ మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ సంద‌ర్భంగా తేజ్‌.. త‌న బైక్ యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.

ప్రమాదం జరిగి తాను బెడ్ పై ఉన్న స‌మ‌యంలో చాలా మంది ట్రోల్ చేశార‌ని, అయితే ఆ ట్రోట్స్‌ కి తానేమి బాధపడటం లేదని, ప్రమాదం ఎప్పుడు కూడా పీడకల కాదని అదొక స్వీట్ మెమోరీ అని తేజ్ చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో సరైన విధంగా ఆలోచించడానికి అదొక మంచి లెస్సన్ కింద ఉంటుందని పేర్కొన్నాడు. అంతేకాదు, ప్రమాదం తర్వాత తన ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది అని తెలిపారు. దీంతో తేజ్ కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.