టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గత ఏడాది వరుస ఫ్లాపులతో ఎంతలా సతమతం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే సక్సెస్ లేకపోయినా ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం సౌత్ తో పాటు నార్త్ లోనూ సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది.
ఇదిలా ఉంటే.. తాజాగా `కిసీ కా భాయ్ కిసీ కీ జాన్` ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజా హెగ్డే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే కన్నడ రాక్ స్టార్ యశ్ పై తన అభిమానాన్ని చాటుకుంది. కేజీఎఫ్ సిరీస్ సినిమాల్లో యశ్ నటన అద్భుతం.. అతనొక లెజెంట్ అంటూ బుట్టబొమ్మ కొనియాడింది.
ఇటీవలే యశ్ను ఓ వేడుకలో కలిశానని చెప్పింది. అలాగే యశ్తో కలిసి ఒక్కసారైనా వర్క్ చేయాలనుందంటూ మనసులో కోరికను బయటపెట్టేసింది. అతడితో సినిమా చేయాలన్న తన కోరిక త్వరలోనే నెరవేరుతుందన్న నమ్మకాన్ని కూడా వ్యక్తం చేసింది. కాగా, కేజీఎఫ్ సక్సెస్ తర్వాత యశ్ నుంచి మరో సినిమా రాలేదు. అయితే మలయాళ దర్శకురాలు, జాతీయ అవార్డ్ విన్నర్ గీతూ మోహన్దాస్ డైరెక్షన్ లో యశ్ నెక్స్ట్ ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది.