రెడ్లతోనే రిస్క్..డిప్యూటీ సీఎంకు చెక్ పెడుతున్నారా?

వైసీపీ అంటే రెడ్డి వర్గం హవా ఎక్కువ ఉంటుందనే సంగతి తెలిసిందే. అయితే కొంతమంది రెడ్డి నేతలకే తప్ప..రెడ్డి సామాజికవర్గం ప్రజలకు వైసీపీ వల్ల ఒరిగింది ఏమి కనిపించడం లేదు. అయితే పార్టీలో కొందరు రెడ్డి నేతల పెత్తనం ఎక్కువ ఉందనే అసంతృప్తి వేరే వర్గాల్లో ఉంది. కాకపోతే బహిరంగంగా ఆ విషయాన్ని ఎవరు బయటపెట్టడం లేదు..కానీ కొన్ని సందర్భాల్లో కొందరు నేతలు బయటపెట్టాల్సి వస్తుంది.

ఆఖరికి మంత్రులపై కూడా రెడ్డి నేతల పెత్తనం ఉందనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే డిప్యూటీ సి‌ఎం నారాయణస్వామి రెడ్డి వర్గంపై చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.  కోటీశ్వరులైన రెడ్లే తనను తిడుతున్నారని, ఇంకెవరూ తనను వ్యతిరేకించటం లేదని,  తన సహకారంతో పదవులు పొందిన వారే తనను విమర్శిస్తున్నారని,  తన ద్వారా పదవులు పొంది తననే విమర్శించటం మంచిది కాదని ఫైర్ అయ్యారు. తాను గత ఎన్నికల్లో రెడ్ల వలనే గెలుపొందానని ఆ వర్గంలోని కొందరు నేతలు అర్దం లేని విమర్శలు చేస్తున్నారని అన్నారు.

మాజీ ఎంపీ, ప్రభుత్వ ఎన్ ఆర్ఐ సలహాదారు జ్ఞానేంద్ర రెడ్డి కుటుంబ సభ్యులను ఉద్దేశించి నారాయణస్వామి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తాను రెడ్ల సహకారంతోనే సమితి ఎన్నికల నుంచి ఇప్పటి వరకు గెలుస్తున్నానని, ఎవరైతే సీఎం జగన్ ను తిడుతారో వారినే తాను తిడుతున్నానని వివరించారు. ఎవరికైనా తాను అన్యాయం చేసి ఉంటే నేరుగా వచ్చిన మాట్లాడాలని చెప్పుకొచ్చారు.

అయితే గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో నారాయస్వామికి చెక్ పెట్టేలా జ్ఞానేంద్ర రెడ్డి రాజకీయం చేస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన టార్గెట్ గానే నారాయణస్వామి విమర్శలు చేశారని అర్ధమవుతుంది.