తొలి వలపు సినిమాతో టాలీవుడ్లో గోపీచంద్ తన ప్రస్థానం ప్రారంభించాడు. తొలిసినిమాలో హీరోగా చేసినా, తర్వాత విలన్ పాత్రల్లో మెప్పించి, ఆకట్టుకున్నాడు. స్టార్ హీరోలకు ధీటుగా నటించి ప్రత్యేకమైన స్టార్ డమ్ సంపాదించుకున్నాడు. విలన్ పాత్రల్లో ఆయనకు ఎంతో పేరు దక్కడంతో పలు సినీ నిర్మాణ సంస్థలు గోపీచంద్ను హీరోగా పెట్టి సినిమాలు తీశాయి. తొలినాళ్లలో వరు హిట్లు అందుకున్న గోపీచంద్ తర్వాత ఎందుకో వరుస పరాజయాలను పొందుతున్నాడు. ఏ జోనర్లో సినిమా తీసినా ఆశించిన విజయం దక్కడం లేదు. అయితే తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘రామబాణం’ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు పెంచేస్తోంది. ఇది ఆయన కెరీర్ను మరో మలుపు తిప్పుతోందని, భారీ విజయం దక్కడం ఖాయమని అభిమానులు పేర్కొంటున్నారు.
ప్రముఖ నిర్మాణ సంస్థ రామబాణం సినిమాను రూపొందిస్తోంది. ఇదే నిర్మాణ సంస్థ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, ప్రభాస్ సినిమాలను సైతం నిర్మిస్తోంది. పైగా పలువురు స్టార్ హీరోల డేట్లు ఈ నిర్మాణ సంస్థ వద్ద ఉన్నాయి. వరుసగా భారీ సినిమాలను ఈ చిత్ర నిర్మాణ సంస్థ రూపొందించనుంది. దీంతో గోపీచంద్ హీరోగా వస్తున్న రామబాణం సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాకు శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో గోపీచంద్ హీరోగా నటించిన లౌక్యం, లక్ష్యం సినిమాలకు ఆయనే దర్శకత్వం వహించారు. దీంతో వీరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా సైతం హిట్ దక్కించుకుంటుందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదలైంది. గోపీచంద్ హీరోయిజం, మాస్ ఎలివేషన్, యాక్షన్ ఘట్టాలు, నిర్మాణ విలువలు అన్నీ అందులో కనిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా ఆశించిన విజయం దక్కకపోతే తిరిగి విలన్ పాత్రల్లో గోపీ చంద్ కనిపించనున్నాడనే ప్రచారం సాగుతోంది. ఏదేమైనా తమ హీరోకు భారీ విజయం దక్కనుందని గోపీచంద్ ఫ్యాన్స్ కొండంత నమ్మకంతో ఉన్నారు.