ప్రభాస్ హీరోయిన్ బికినీపై దర్శకుడు సెన్సేషనల్ కామెంట్స్..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన పఠాన్ చిత్రంలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె కలిసి నటించారు. ఈ సినిమాలోని ఒక సన్నివేశంలో ఆమె ధరించిన బికినీ రంగు వివాదాలకు దారితీసింది. గత ఏడాది జరిగిన అతిపెద్ద వివాదాల్లో ఇది ఒకటి. పఠాన్‌ సినిమాలోని “బేషరమ్ రంగ్” పాట విడుదలైనప్పుడు, దీపికా బికినీ లుక్ చర్చనీయాంశమైంది. అయితే, ఆమె ఆరెంజ్ కలర్ బికినీని ధరించిందని, ఆ రంగు సాంస్కృతిక, మతపరమైన టోన్‌గా ఉందని చాలా మంది బాధపడ్డారు. దాంతో సినిమా బ్యాన్ చేయాలని సోషల్ మీడియాతో పాటు బయట కూడా డిమాండ్స్ వినిపించాయి.

ఈ వివాదంపై చిత్ర హీరో షారుక్‌ ఖాన్‌, హీరోయిన్‌ దీపికా పదుకొణె, దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ ఇంతకు ముందు నోరు మెదపలేదు. అంతేకాకుండా సినిమా బాక్సాఫీస్ అవకాశాలను దెబ్బతీస్తుందనే భయంతో వారు సినిమా ప్రచార కార్యక్రమాలన్నింటినీ రద్దు చేశారు. ఇక ఇప్పుడు ఈ చిత్రం దాని లాంగ్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.1100 కోట్లు వసూలు చేసింది. ఇక ఇప్పుడు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ఆరెంజ్ కలర్ బికినీ గురించి క్లారిటీ ఇచ్చారు.

“స్పెయిన్‌లో చిత్రీకరించిన ఒక పాట కోసం అక్కడి వాతావరణం ఆకుపచ్చ, నీలంతో నిండి ఉంది. అందుకే మేం ఆరెంజ్ రంగు పాప్ అవుట్ అయితే బాగుంటుందని భావించాము. ఒక సినిమా ఫలితం 100 కోట్ల పెట్టుబడితో పాటు 1000 మంది ప్రజల జీవితాలతో ముడిపడి ఉంటుంది. కాబట్టి సినిమాని బహిష్కరించాలని పిలుపునిచ్చిన వ్యక్తులు ఆ విషయాలను అర్థం చేసుకోలేరు” అని సిద్ధార్థ్ అన్నారు.