తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలలో ఒకరైన విక్టరీ వెంకటేష్. దగ్గుబాటి రామానాయుడు వారసుడుగా సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. రామానాయుడు అప్పటివరకు ఇతర హీరోలతో సినిమాలు చేసినా వెంకటేష్ హీరోగా పరిచయమైన తర్వాత ఎక్కువగా అతడితోనే సినిమాలు నిర్మించాడు. వెంకటేష్ సినిమా కెరీర్లో ప్లాప్ సినిమాలు కంటే హిట్ సినిమాలు ఎక్కువ. వెంకటేష్ తన కెరీర్ ప్రారంభం నుంచే ఫ్యామిలీ సినిమాలు చేస్తూ వచ్చారు. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. సీనియర్ హీరోలలో వెంకటేష్ చేసినన్ని మల్టీస్టారర్లు ఎవరూ చేయలేదు.
వెంకటేష్ -మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా నుంచే టాలీవుడ్ లో మళ్ళీ మల్టీస్టారర్ సినిమాల శకం మొదలైంది. ఆ తర్వాత పవన్తో గోపాల గోపాల..రామ్తో మసాలా, వరుణ్తేజ్ ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలు చేశాడు. వెంకటేష్ తన కెరియర్ ప్రారంభంలో కొన్ని మల్టీస్టారర్ సినిమాలు మొదలుపెట్టినా అవి మధ్యలోనే ఆగిపోయాయి.
వెంకటేష్ – రెబల్ స్టార్ కృష్ణంరాజు కాంబోలో ఓ మల్టీస్టారర్ను ప్రారంభించారు. ఈ సినిమాకు డైరెక్టర్ గా రోజా భర్త ఆర్కే సెల్వమణి అనుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా విజయశాంతిని ఎంపిక చేశారు. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టారు. అదే సమయంలో బి. గోపాల్తో బొబ్బిలిరాజా చేయాలని అనుకోవడంతో ఈ మల్టీస్టారర్ మధ్యలోనే ఆగిపోయింది.
అలాగే టాలీవుడ్ సోగ్గాడు శోభన్ బాబుతో కూడా వెంకీ ఓ మల్టీస్టారర్ మొదలుపెట్టారు. ఈ సినిమాకు డైరెక్టర్ గా బి. గోపాల్ అనుకున్నారు. ఈ సినిమా కూడా షూటింగ్ మొదలైంది. మ్యూజిక్ డైరెక్టర్గా బప్పీలహరిని నియమించుకున్నారు. కథ సరిగా రాలేదన్న కారణంతో ఈ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇలా వెంకటేష్ తన కెరీర్ ప్రారంభంలో చేయాలనుకున్న మల్టీస్టారర్ సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి.