`మ‌హాన‌టి`ని రిజెక్ట్ చేసిన కీర్తి సురేష్.. అస‌లు ఆ రోజు ఏం జ‌రిగిందో తెలిస్తే షాకే!

మహానటి.. అలనాటి తార సావిత్రి బయోపిక్ ఇది. 2018లో విడుదలైన ఈ చిత్రం ఎంత సంచ‌ల‌న‌ విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. కీర్తి సురేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచింది. ఆమెకు స్టార్ హోదాను పటిష్టం చేసింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించిన కాదు జీవించేసింది. ఆమె నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.

అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మహానటి చిత్తాన్ని మొదట కీర్తి సురేష్ రిజెక్ట్ చేసిందట. అవును కీర్తి సురేష్ స్వ‌యంగా దీనిని బయటపెట్టింది. ప్రస్తుతం దసరా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న కీర్తి సురేష్.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా మహానటి సినిమా గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. `మహానటి చిత్రానికి నేను మొద‌ట నో చెప్పాను. సావిత్రమ్మ పాత్రలో నటించడానికి చాలా భ‌య‌ప‌డ్డాను. కానీ దర్శకుడు నాగ్ అశ్విన్‌ నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఇది నువ్వు చేయగలవు అని ధైర్యాన్ని ఇచ్చారు.

ఆయనే నన్ను అంతగా నమ్మినప్పుడు.. నన్ను నేనెందుకు నమ్మకూడదనుకున్న. అలా ఆ ప్రాజెక్ట్‌ చేశా. ఇక మహానటి చేస్తున్న సమయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. సావిత్రి పాత్రకు నేను సరిపోనంటూ ఘోరంగా ట్రోల్ చేశారు. కానీ నేను అవేమి పట్టించుకోలేదు. సావిత్రమ్మ పాత్రకు వంద శాతం న్యాయం చేయడం పైనే ఫోకస్ పెట్టాను. ఫైనల్ గా సినిమా మంచి విజయం సాధించింది. నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది` అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది. ఏదేమైనా కీర్తి సురేష్ ఆ రోజు ధైర్యం చేసి ఉండ‌క‌పోయుంటే మ‌హాన‌టి చిత్రం అంత గొప్పగా వ‌చ్చేది కాదేమో.