ఆ సినిమా వ‌ల్లే `శాకుంత‌లం`లో స‌మంత‌కు ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని మీకు తెలుసా?

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా పాన్ ఇండియ‌న్ ఫిల్మ్ `శాకుంత‌లం`. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గుణ శేఖ‌ర్ రూపొందించిన ఎపిక్ ల‌వ్ స్టోరీ ఇది. ఇందులో శ‌కుంత‌ల‌గా స‌మంత న‌టిస్తే.. ఆమెకు జోడీగా దుష్యంత మహారాజు పాత్ర‌ల‌కు మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్ చేశాడు.

దిల్ రాజు సమర్పణలో గుణ టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌పై నీలిమ గుణ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 14న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఊపందుకున్నాయి. సౌత్ తో పాటు నార్త్ లో ఈ సినిమాను గ‌ట్టిగా ప్ర‌మోట్ చేసేందుకు మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో స‌మంత‌నే ఎందుకు తీసుకున్నారు..? అస‌లు శాకుంత‌లంలో ఆమెకు ఎలా ఆఫ‌ర్ వ‌చ్చింది..? అన్న విష‌యాల‌ను తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న గుణ‌శేఖ‌ర్ వివ‌రించారు.

`శకుంతల పాత్రలో సమంతను అనుకోలేదు. ఆ పాత్రకి ఎవరైతే బాగుంటారా అని ఆలోచన చేస్తుండగా.. సమంత అయితే బాగుంటుంది అని మా అమ్మాయి చెప్పింది. దాంతో ఆమె నటించిన రంగస్థలం సినిమా రెండో సారి చూశాను. ఒక పాత్రలో సమంత ఎంతగా ఒదిగిపోతుందనేది అప్పుడే నాకు అర్ధం అయ్యింది. దాంతో శాకుంతలం కోసం ఆమెను సంప్రదించడం జరిగింది` అని చెప్పుకొచ్చారు గుణశేఖర్. మొత్తానికి రంగస్థలం సినిమా వ‌ల్లే స‌మంత‌కు శాకుంత‌లంలో ఆఫ‌ర్ ద‌క్కింద‌న్న‌మాట‌.