ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన `పుష్ప` 2021 డిసెంబర్ లో విడుదలై ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇందులో సునీల్, ఫహాద్ ఫాజిల్, అనసూయ, ధనుంజయ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం.. అన్ని భాషల్లోనూ వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ సినిమాకు కొనసాగింపుగా `పుష్ప 2` రాబోతోంది. గత ఏడాది ఫిబ్రవరిలోనే ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉన్నా.. స్క్రిప్ట్ లో పలు మార్పులు, చేర్పులు చేయడం వల్ల షూటింగ్ ఆలస్యం అయింది. ఇక ఫైనల్ గా ఇటీవలె రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించాడు.
అయితే ఈ మూవీకి సంబంధించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. డైరెక్టర్ సుకుమార్ రష్మికకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడట. తాజాగా స్క్రిప్ట్ లో పలు మార్పులు చేశారట. దీని కారణంగా రష్మిక పోషించబోయే శ్రీవల్లి పాత్రకు ప్రాధాన్యత, నిడివి రెండు తగ్గిపోతాయట. కొత్త నటులను తీసుకోవడం వల్లే శ్రీవల్లి పాత్రకు నిడివి, ప్రాధాన్యత లేకుండా పోయిందని టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే సుక్కు ఇచ్చిన ఈ షాక్ను రష్మిక అస్సలు ఊహించి ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు.