టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో సత్తా చాటేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. రీసెంట్ గా రకుల్ `ఛత్రివాలీ` మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది.
ఇందులో కండోమ్ టెస్టర్ పాత్రలో రకుల్ నటించి మెప్పించింది. ఇకపోతే రకుల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. `సినిమాల్లో మగవాళ్లదే ఆధిపత్యం.. మనం నివసిస్తున్నదీ పురుషాధిక్యసమాజంలోనే. అంతమాత్రాన భయపడుతూ కూర్చోలేం. ఓటమిని అంగీకరించి వెనక్కి వెళ్లిపోలేం. నేను పురుషుడినా, స్త్రీనా అన్నది అప్రస్తుతం.
నేనో స్టార్ని. నటన నా ప్రాణం. గ్లామర్ కోసమో, డబ్బు కోసమో పరిశ్రమలోకి రావొద్దు. కడుపునిండా తినలేం. హాయిగా వీధుల్లో తిరగలేం. ఇష్టమైన రెస్టారెంట్స్కు వెళ్లలేం. మన జీవితం సినిమా షెడ్యూల్ చుట్టూ తిరుగుతుంది. బలమైన సంకల్పం లేకపోతే పరిశ్రమలో బతకలేం.` అంటూ రకుల్ చెప్పుకొచ్చింది. అలాగే తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉందని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని రకుల్ పేర్కొంది. ఇక షూటింగ్ లేకపోతే తాను స్నేహితులతో కాలక్షేపం చేస్తానని, ఫ్యామిలీతో గడుపుతానని, గోల్ఫ్ ఆడతానని మరియు ఇష్టమైన సినిమాలు చూస్తానని రకుల్ తెలిపింది.