తెలుగుతెరపై రెబలియన్ రోల్స్ చేసి రెబల్ స్టార్ గా గుర్తింపు పొందిన సీనియర్ నటుడు కృష్ణంరాజు గత ఏడాది కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సెప్టెంబర్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే తాజాగా ప్రభాస్ పెదనాన్న మరణానికి ముందు ఏం జరిగింది అన్న విషయాన్ని బయటపెట్టారు.
ఇటీవల ప్రభాస్ నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` టాక్ షాలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ప్రభాస్ ఎపిసోడ్ కు సంబంధించి ఫస్ట్ పార్ట్ ఇప్పటికే బయటకు వచ్చింది. సెకెండ్ పార్ట్ ను జనవరి 6న విడుదల చేయబోతున్నారు. అయితే సెకెండ్ పార్ట్ లో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారట. షోలో కృష్ణంరాజు స్పెషల్ ఏవీ ప్రదర్శించారు.
ఆ వీడియో చూశాక ప్రభాస్ `ఆయన లేకపోతే నేను లేను. మా జీవితాలు ఇలా ఉండేవి కాదు, మా కుటుంబం అంతా పెదనాన్నను మిస్ అవుతోంది` అంటూ కన్నీరు పెట్టుకున్నారు. `పెదనాన్న చనిపోవడానికి ముందు నెలరోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్నారు. నేను ఆయనతో పాటు నెలరోజులు ఆసుపత్రిలోనే ఉండేవాడిని. షూటింగ్ లో ఉన్నప్పటికీ ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్స్ నుండి ఎప్పటికప్పుడూ సమాచారం అడిగి తెలుసుకుంటూ ఉండేవాడిని. ఆయన దూరం కావడం మా జీవితాల్లో అతి పెద్ద లోటు` అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చాడు.