బుల్లితెరపై రికార్డులు సృష్టించిన ఈ 2 సినిమాలను చూశారా? TRPలో అదుర్స్!

కరోనా కారణంగా సినిమాలు చూడటంలో ప్రేక్షకుల అభిరుచులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు సినిమా అంటే కేవలం థియేటర్లో మాత్రమే చూసేది. కానీ నేడు ఆ సినిమా మన చేతిలో వున్న స్మార్ట్ ఫోన్లోకి వచ్చేస్తోంది. ప్రస్తుతం దేశం అంతా OTT హవా నడుస్తోంది. సినిమా విడుదలైన కొన్ని రోజులకే సినిమాలు OTTలో దర్శనం ఇవ్వడంతో సినిమాలను ఆన్‌లైన్‌లో వీక్షించే వారి సంఖ్య రానురాను పెరిగిపోయింది. ముందు థియేటర్‌, ఆ తర్వాత ఓటీటీ చివరిగా టీవీల్లో కూడా సినిమాలు వస్తున్నాయి.

ఇక కథలో కంటెంట్‌ ఉండాలే కానీ ఎన్నిసార్లు టెలికాస్ట్‌ అయినా సదరు సినిమాకు ఏ మాత్రం క్రేజ్‌ తగ్గదని ఈ మధ్యకాలంలో రిలీజైన 2 చిత్రాలు నిరూపించాయి. వీటిలో ఒకటి సీతారామం కాగా మరొకటి కార్తికేయ2. అవును, దాదాపు ఒకటే సమయంలో విడుదలైన ఈ రెండు చిత్రాలు బాక్షాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఓ రకంగా అప్పటి వరకు కరోనా కారణంగా థియేటర్లకు రావడానికి ఆసక్తి చూపించని ప్రేక్షకులను ఈ రెండు చిత్రాలు రప్పించేలా చేశాయి. బాక్సాఫీస్‌ వద్ద రూ. 100 కోట్లను కలెక్ట్‌ చేసి దుమ్మురేపాయి.

చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన కార్తికేయ పాన్‌ ఇండియా స్థాయిలో కూడా సత్తా చాటడం కొసమెరుపు. కేవలం థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనూ ఈ 2 చిత్రాలు బాగా ఆడాయి. దాంతో హైయెస్ట్ వ్యూస్‌ సొంతం చేసుకొని రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ రెండు చిత్రాలు బుల్లి తెరపై కూడా సందడి చేసి అదిరిపోయే రేటింగ్ తో దూసుకుపోయాయి. ఇటీవల టీవీలో ప్రసారమైన సీతారామం చిత్రానికి 8.73 టీర్‌పీ రేటింగ్‌ రాగా కార్తికేయ2 7.88 రేటింగ్‌ను తెచ్చుకోవడం విశేషం.