`నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి`పై కామెంట్ల మోత‌.. ప్ర‌తి ఒక్క‌రూ అదే మాట‌!

మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్ పై నిర్మితం అవుతున్న ఈ చిత్రానికి బాబీ ద‌ర్శ‌కత్వం వ‌హించాడు. ఇందులో మాస్ మహారాజ రవితేజ‌ కీలక పాత్రను పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. పోర్ట్‌ ఏరియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే కంప్లీట్‌ కమర్షియల్‌ మూవీ ఇది.

వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌బోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్డేట్లతో సినిమాపై మంచి హైప్‌ క్రియేట్ చేస్తున్నారు. ఇందులో భాగం గానే ఇటీవల బాస్ పార్టీ పేరుతో ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్‌.. నిన్న సెకండ్ సింగిల్ `నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి`ను బయటకు వదిలింది. దేవి శ్రీ ప్రసాద్ చిరు, శ్రుతిల మ‌ధ్య‌ కెమిస్ట్రీని వర్ణిస్తూ పాటను స్వయంగా రాసి అవుట్ స్టాండింగ్ గా కంపోజ్ చేశారు.

జస్‌ప్రీత్ జాస్, సమీరా భరద్వాజ్ ఆల‌పించిన‌ ఈ పాట ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ప్ర‌స్తుతం ఈ పాట‌పై నెటిజ‌న్లు కామెంట్ల మోత మోగిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ చిరంజీవి డ్యాన్స్ లో గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదని, ఆ సాంగ్ లో మెగాస్టార్ వ‌య‌సు 20 ఏళ్లు తగ్గిందని కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే ఈ సాంగ్ లో చిరు సూప‌ర్ హ్యాండ్స‌మ్‌గా క‌నిపిస్తున్నారు.