గుంటూరు తమ్ముళ్ళకు బాబు ‘ఘాటు’..!

అధికార పార్టీపై పోరాటం చేసే విషయంలో, ప్రజల్లో తిరగడం, ప్రజా సమస్యలపై పోరాటం చేసే విషయంలో టీడీపీ నేతలు వెనుకబడితే..వారికి చంద్రబాబు గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నారు. ఈ సారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే కసితో బాబు పనిచేస్తున్నారు..అందుకు తగ్గట్టుగానే నేతలు పనిచేయకపోతే వారిని సైడ్ చేయడానికి కూడా బాబు వెనుకాడనని వార్నింగ్ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే వరుసపెట్టి నియోజకవర్గ ఇంచార్జ్‌లతో భేటీ అవుతూ..వారికి గట్టిగా క్లాస్ పీకుతున్నారు.

ఇక మధ్య మధ్యలో జిల్లాల వారీగా టీడీపీ నేతలతో సమావేశమై కూడా క్లాస్ ఇస్తున్నారు. ఆ మధ్య కృష్ణా జిల్లా తమ్ముళ్ళకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, అలాగే వైసీపీ దాడులు చేస్తుంటే..కలిసి పోరాటం చేయడం లేదని ఫైర్ అయ్యారు. ముఖ్యంగా చెన్నుపాటి గాంధీపై వైసీపీ నాయకులు దాడి చేస్తే..జిల్లాలోని టీడీపీ నేతలు పెద్దగా స్పందించలేదు. బాబు గట్టిగా వార్నింగ్ ఇచ్చాక వారు కదిలారు. అలాగే జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుని..వైసీపీపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు కృష్ణా తమ్ముళ్ళు దూకుడుగా పనిచేస్తున్నారు.

సేమ్ అదే మాదిరిగా తాజాగా గుంటూరు తమ్ముళ్ళకు బాబు క్లాస్ ఇచ్చారు. టీడీపీకి బాగా పట్టు పెరుగుతున్న గుంటూరులో కొందరు నేతలు ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేయడం లేదని, అందరూ కలిసికట్టుగా పనిచేయడం లేదని, పల్నాడులో ఇప్పటికీ టీడీపీ క్యాడర్‌పై దాడులు జరుగుతున్నాయని, కానీ అక్కడకు వెళ్ళి జిల్లా నేతలు..కార్యకర్తలకు భరోసా ఇవ్వలేకపోతున్నారని బాబు ఫైర్ అయ్యారు.

గుంటూరులో అందరూ పెద్ద నాయకులైపోయారని, సీనియారిటీ పెరిగిపోయి పని తగ్గిపోతోందని, ఎన్నికలై మూడేళ్లు దాటినా సరే  కొందరు ఇన్‌చార్జులు ఇంకా ప్రజల్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండటం లేదని తనకు ఫిర్యాదులు వస్తున్నాయని, జనంలో లేకపోతే నష్టపోతామని గుర్తించాలని హెచ్చరించారు. ఇక బాబు ఘాటు వార్నింగ్‌కు గుంటూరు నేతలు అలెర్ట్ అయ్యారు..అందరం కలిసి టీమ్ వర్క్ చేస్తామని, జిల్లా విస్తృత స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. మరి బాబు దెబ్బకు గుంటూరు తమ్ముళ్ళలో మార్పు వస్తుందో లేదో చూడాలి.