ఒకేసారి అన్నేసి పడవలపై కాళ్లు వేస్తున్న త్రివిక్రమ్.. ఇలా అయితే కష్టమే?

ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మంచి హిట్ కొట్టక ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. గత ఐదేళ్లలో అతనికి అల వైకుంఠపురములో తప్ప మరో హిట్ లేదు. ఒక దర్శకుడిగా అతడు ఎక్కువగా సినిమాలు కూడా తీయలేకపోతున్నాడు. దీనికి కారణం అతడు ఒకేసారి నాలుగైదు పడవలపై కాళ్లు వేస్తూ ఉండడమే అని తెలుస్తోంది. అతని భార్య సాయి సౌజన్య నిర్మాణ రంగంలో అడుగు పెట్టడంతో ఆమె తీసే సినిమాల కథలు చెక్ చేయడం, వాటి క్వాలిటీని పెంచడం చేస్తున్నాడు త్రివిక్రమ్. అంతేకాదు, ఆమె నిర్మాణంలో సినిమా స్టార్ట్ అయిన సమయం నుంచి విడుదల వరకు అన్ని పనులు అతడే పర్యవేక్షించాల్సి వస్తోంది.

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరు జాన్ జిగ్రీలు. అందుకే పవన్ తీయబోయే అన్ని సినిమాల వ్యవహారాలూ త్రివిక్రమ్ చూసుకోవలసి వస్తోంది. పవన్ సినిమాకి డైలాగులు అతనే అందించాలి, కథ కూడా అతనే అందించాలి. ఇవన్నీ చూసుకుంటూనే మరో వైపు తన సొంత సినిమాలు తీయాల్సి ఉంటోంది. ఇదంతా కూడా అతనికి చాలా భారమై పోతుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

ప్రస్తుత విషయానికి వస్తే.. త్రివిక్రమ్ సెప్టెంబర్ నుంచి మహేష్ బాబు సినిమా షూట్‌లో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ పొలిటికల్‌గా యాక్టివ్ కావడంతో కాస్త పనులు తగ్గాయి. సెప్టెంబర్ నుంచి హరి హర వీరమల్లు సినిమా ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే సెప్టెంబర్ నెలలో త్రివిక్రమ్‌ బిజీ అయిపోతాడు. అక్టోబర్‌లో పవన్ రాజకీయ యాత్ర చేపట్టనున్నాడు కాబట్టి అప్పుడు అతను ఈ వ్యవహారాల నుంచి కాస్త ఫ్రీగా అవుతాడు. కాగా పవన్ మరో రీమేక్ కూడా చేస్తున్నట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్‌ హీరోగా సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఓ రీమేక్‌కు పవన్ 20 రోజుల డేట్స్ ఇచ్చాడట. ఈ సినిమాకి కూడా త్రివిక్రమ్ యే ప్లానింగ్ ఇస్తున్నాడట. అలాగే స్క్రిప్ట్ కూడా రాస్తున్నాడట. మరి ఇన్ని పనులు అతనొక్కడే ఎలా చేస్తున్నాడో ఏమో అని నెటిజన్లు చర్చిస్తున్నారు. ఇలా అయితే ఓన్ సినిమాలు చేయడం కష్టమని అంటున్నారు.