అసెంబ్లీ వైపు ఎంపీ అభ్యర్ధులు..?

ఏపీ రాజకీయాల్లో అప్పుడే ఎన్నికల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగానే…ఇప్పటినుంచే పార్టీలు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. అలాగే ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్ధులని కూడా ఫిక్స్ చేస్తూ వచ్చేస్తున్నారు. అటు వైసీపీలో, ఇటు టీడీపీలో కొన్నినియోజకవర్గాలకు అభ్యర్ధులు ఫిక్స్ అయిపోయారు. ఇదే క్రమంలో నెక్స్ట్ ఎన్నికల్లో పోటీకి ఎంపీ అభ్యర్ధులు సిద్ధమవుతున్నారు.

గత ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేసిన వారు..ఈ సారి ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు…నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారని కథనాలు వస్తున్నాయి. నర్సన్నపేట లో పోటీ చేయాలని రామ్మోహన్ చూస్తున్నారట. అలాగే గతఎన్నికల్లో విజయనగరం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అశోక్ గజపతి..ఈ సారి విజయనగరం అసెంబ్లీలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు.

అటు నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన టీడీపీ సీనియర్ వేటుకూరి శివరామరాజు…ఈ సారి ఉండి అసెంబ్లీలో పోటీ చేసే ఛాన్స్ ఉంది. గతంలో ఈయన ఉండి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే హిందూపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నిమ్మల కిష్టప్ప సైతం…అసెంబ్లీ వైపే మొగ్గు చూపుతున్నారట. పెనుకొండ సీటుపై ఆయన కన్నేశారు. బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి కూడా ఈ సారి అసెంబ్లీ సీటుపై ఫోకస్ చేశారు. గత ఎన్నికల్లో ఈయన టీడీపీ నుంచి పోటీ చేసి కడప ఎంపీగా ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు జమ్మలమడుగు సీటుపై ఆయన ఫోకస్ పెట్టారు.

అయితే వైసీపీ సిట్టింగ్ ఎంపీలు కొందరు…అసెంబ్లీ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. కాకినాడ ఎంపీ వంగా గీతా, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, విజయనగరం ఎంపీ చంద్రశేఖర్ లతో పలువురు ఎంపీలు…అసెంబ్లీ స్థానాలపై ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సారి ఎంతమంది ఎంపీ అభ్యర్ధులు…అసెంబ్లీ బరిలోఉంటారో?