చరితా రెడ్డికి ఛాన్స్ దొరకడం లేదా?

ఏపీ రాజకీయాల్లో గౌరుచరితా రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు…వైఎస్సార్ పేరు వినబడినంతకాలం చరితా రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. రాజకీయాల్లో వైఎస్సార్ సోదరి భావంతో చూసిన వారిలో చరితా రెడ్డి కూడా ఒకరు. ఆమెకు వైఎస్సార్ ఎంత ప్రాధాన్యత ఇచ్చారో కూడా తెలిసిందే. అలాగే 2004లో నందికొట్కూరు సీటు ఇచ్చి…ఆమెని గెలిపించుకున్నారు. అలా వైఎస్సార్ తో ఉన్న సాన్నిహిత్యంతో చరితా..తర్వాత జగన్ పెట్టిన వైసీపీలో చేరి..ఆ పార్టీలో పనిచేశారు.

2014లో పాణ్యం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు..అయితే జగన్ అధికారంలోకి రాకపోయినా సరే…వైసీపీ బలోపేతం కోసం కష్టపడ్డారు. 2019 ఎన్నికలముందు వరకు వైసీపీ కోసమే పనిచేశారు…కానీ ఎప్పుడైతే పాణ్యంలో కాటసాని రామ్ భూపాల్ రెడ్డి వైసీపీలోకి వచ్చారో అప్పటినుంచి చరితాకు సీటుపై డౌట్ మొదలైంది. ఎందుకంటే పాణ్యంలోభూపాల్ రెడ్డికి తిరుగులేదు…చాలా సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు..2014లోఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓట్లు బాగా తెచ్చుకున్నారు. వ్యక్తిగతంగా కాటసానికి మంచి ఫాలోయింగ్ ఉంది.

దీంతో ఆయన వైసీపీలోకి రావడంతో..పాణ్యం సీటు ఆయనకే ఫిక్స్ అయిపోతుందని చరితా ఊహించారు. ఈ క్రమంలోనే ఆమె వైసీపీని వీడి…టీడీపీలోకి వచ్చేశారు. ఒక వైఎస్సార్ అభిమానిగా ఉంటూ…టీడీపీలోకి వచ్చిన చరితాకు 2019లో భారీ ఓటమి ఎదురైంది. ఆ రేంజ్ లో ఓటమి వచ్చినా సరే చరితా…పాణ్యంలో టీడీపీ బలోపేతం కోసం కృషి చేస్తున్నారు…నెక్స్ట్ పాణ్యంలో టీడీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు.

అయితే పాణ్యంలో కాటసాని లాంటి బలమైన నాయకుడుని ధీటుగా ఎదురుకుని గెలవడం చాలా కష్టమైన విషయం. పైగా అక్కడ కాటసానికి అనుకూలమైన వాతావరణం ఉంది. రాష్ట్రంలో కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వస్తుంది గాని, కాటసానిపై అలాంటి వ్యతిరేకతలేదు…నెక్స్ట్ ఎన్నికల్లో కూడా ఆయన గెలుపుకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. ఈ పరిణామాలు బట్టి చూస్తే..పాణ్యంలో చరితా రెడ్డికి మళ్ళీ గెలిచే అవకాశాలు తక్కువే ఉన్నాయని చెప్పొచ్చు.