బీజేపీతో బాబు..సజ్జల నిజాలు?

2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు..బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఎన్నికల ముందు వరకు బీజేపీపై తీవ్ర స్థాయిలో పోరాటం చేసిన బాబు…ఎన్నికల్లో ఓడిపోయాక పూర్తిగా సైలెంట్ అయ్యారు. బీజేపీని ఒక్క మాట కూడా అనడం లేదు…అలాగే తమ సన్నిహితులు బీజేపీలోకి వెళ్ళినా సరే స్పందించలేదు. అసలు వారిని బాబే…బీజేపీలోకి పంపారని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఏదొక విధంగా బీజేపీకి బాబు మద్ధతు ఇస్తూనే వచ్చారు.

ఇక చివరికి మోదీని కలిసే అవకాశం బాబుకు వచ్చింది. ఆజాదీకా అమృత్ ఉత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా మోదీని బాబు కలిశారు…ఓ ఐదు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. దీనిపై ఏపీలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది..మళ్ళీ బీజేపీకి బాబు దగ్గరయ్యారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంటారని ప్రచారం మొదలైంది. అయితే తమ మధ్య కుశల ప్రశ్నలు తప్ప…మరే చర్చ జరగలేదని బాబు చెబుతున్నారు.

అయినా సరే వైసీపీ వర్షన్ వేరుగా ఉంది…మళ్ళీ బాబు బీజేపీకి దగ్గరైపోతున్నారని, అలాగే బీజేపీకి బాబు ఒక ఆఫర్ కూడా ఇచ్చారని సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు. మోదీ-బాబు మాట్లాడుకున్నది పూర్తిగా తెలిసినట్లే సజ్జల చెప్పుకొచ్చారు. బాబు తీరు గమనిస్తే… తెలంగాణలో బీజేపీకి ఉపయోగపడే విధంగా తాము, పవన్‌కళ్యాణ్‌ పని చేస్తామని, అందుకు బదులుగా ఏపీలో తమకు సహకరించమని మోదీని కోరుతున్నట్లు అనిపిస్తోందంటూ సజ్జల మాట్లాడారు.

అయితే గత నాలుగైదు నెలల నుంచి…బాబు ఈ ఆఫర్ తో బీజేపీని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు.  అయినా బాబుపై బీజేపీకి నమ్మకం ఉందా? అని చెప్పి ప్రశ్నించారు. అలాగే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీని నాశనం చేశారని అన్నారు. మొత్తానికైతే మోదీ-బాబు మధ్య జరిగిన డిస్కషన్ అంతా తెలిసినట్లు సజ్జల మాట్లాడారు. మరి సజ్జల ఊహించి చెప్పిన కథలో నిజమెంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే…తెలంగాణలో జరిగే రాజకీయాన్ని బట్టి క్లారిటీ వచ్చేస్తుంది.