ఓ సినిమా సూపర్ హిట్ అయ్యిందంటే చాలు ఎందుకు ఇంత పెద్ద హిట్ అయ్యిందని వెతికే వారు ఉండరు. ఆ విజయంలో భాగస్వాములు అయ్యేందుకు ఎవరికి వారు క్రెడిట్ కోసం పాకులాడుతూ ఉంటారు. ఈ క్రెడిట్ మాదంటే మాదే అని దర్శకుడు, నిర్మాత, హీరో, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఎవరికి వారు భజనలు, పొగడ్తలు, కీర్తనలు మొదలు పెట్టేస్తారు. అయితే సినిమా ప్లాప్ అయితే దానిని ఎవరి మీదకు తోసేయాలన్న ఆలోచనలే మొదలవుతాయి.
ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ప్లాప్ కావడంతో ఈ ప్లాప్ను అందరూ కలిసి కట్టుగా డైరెక్టర్ కొరటాల శివ మీదకు నెట్టి వేస్తున్నారు. చిరంజీవి భార్యతో కలిసి విదేశీ టూర్కు వెళ్లిపోయారు. ఆయన నెల రోజుల వరకు రానని అంటున్నారు. రామ్చరణ్ శంకర్ డైరెక్షన్లో తాను నటిస్తోన్న సినిమా పనిలో బిజీ అయిపోయాడు.
ఇక ఇప్పుడు మెగాభిమానులు, విమర్శకులు, మేథావులు, ట్రేడ్ వర్గాలు అందరూ కూడా కొరటాల శివను కార్నర్ చేస్తూ విమర్శిస్తున్నారు. ఇద్దరు స్టార్ హీరోలను మేనేజ్ చేసే దమ్మున్న కథను కొరటాల ఎంచుకోలేదనే ప్రతి ఒక్కరు అంటున్నారు. అసలు కొరటాల వీక్ కథతో ముందుగానే ఫెయిల్ అయిపోయాడని అంటున్నారు.
వాస్తవంగా కొరటాల నాలుగు సినిమాలు చూస్తే మిర్చి – శ్రీమంతుడు – జనతా గ్యారేజ్ – భరత్ అనే నేను సినిమాలు బ్లాక్బస్టర్ హిట్లే . అవి ఆ హీరోల కెరీర్కు ఎంతో ప్లస్ అయ్యాయి. మరి ఇన్నీ బ్లాక్బస్టర్లు ఉన్న కొరటాల కనీసం యావరేజ్ సినిమా కాకుండా.. ఇంత డిజాస్టర్ సినిమా తీస్తాడా ? అన్న సందేహాలు కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.
కొరటాలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదన్న వాదన కూడా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. రేపు షూటింగ్ జరిగే సీన్లను కూడా ఈ రోజు రాత్రి మార్చడం వల్లే కొరటాల సైతం ఏం చేయలేకపోయాడని మరో వాదన. అయితే చాలా మంది మాత్రం కొరటాలను బలి చేసేస్తున్నారు.