భారీ సినీ బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా సక్సెస్ కాలేకపోయిన వారసులు ఎందరో తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నారు. ఈ లిస్ట్లో సీనియర్ స్టార్ హీరో, యాంగ్రీ యంగ్మెన్ రాజశేఖర్ కూతుళ్లు కూడా ఒకరు. చిన్న కూతురు శివాత్మిక `దొరసాని` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్గా నిలిచింది. ఈ మూవీ తర్వాత శివాత్మిక పలు ప్రాజెక్ట్స్ టేకప్ చేసినా.. అవి ఇప్పటి వరకు విడుదల కాలేదు.
మరోవైపు రాజశేఖర్ పెద్ద కూతురు శివానికి కెరీర్ ఆరంభంలోనే అడ్డంకులు ఎదురయ్యాయి. ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇస్తూ నటించిన `టూ స్టేట్స్` చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఇక చివరకు ఈ బ్యూటీ అద్భుతం సినిమాతో ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. హాట్స్టార్లో విడుదలైన ఈ మూవీ ఓ మోస్తరు టాక్ను సొంతం చేసుకుంది. అలాగే ఈమె రెండో చిత్రం `డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ` కు సైతం అంతంత మాత్రంగానే బజ్ ఉంది.
మొత్తానికి టాలీవుడ్లో ఏ మాత్రం సత్తా చాటలేకపోతున్న ఈ అక్కాచెల్లెళ్లు.. రూటు మార్చి కోలీవుడ్లో స్టార్స్గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. శివాత్మిక తమిళంలో హీరోయిన్గా పరిచయం కానున్న ‘ఆనందం విలయాడుం వీడు’ డిసెంబర్ 24న విడుదల కాబోతోంది. పక్కా గ్రామీణ వాతావరణంలో నడిచే ఈ చిత్రంలో కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ హీరోగా నటించారు.
అలాగే మరోవైపు శివాని తమిళంలో ‘అన్బరివు’ అనే సినిమాతో ఎంట్రీ ఇస్తోంది. హిప్హాప్ ఆది హీరోగా నటిస్తున్న ఈ చిత్రం జనవరి 7న హాట్ స్టార్ ద్వారా రిలీజ్ కాబోతోంది. సాయికుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరి శివాని, శివాత్మికల తొలి చిత్రాలు మంచి విజయం సాధిస్తే గనుక.. తమిళంలో వీరిద్దరికీ మరిన్ని అవకాశాలు రావడం ఖాయం అవుతుంది.