క‌త్రినా కైఫ్ పెళ్లికి వెళ్తున్న ఏకైక టాలీవుడ్ హీరో ఎవ‌రో తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రినా కైఫ్ ప్ర‌ముఖ న‌టుడు విక్కీ కౌశ‌ల్‌తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 9న రాజ‌స్థాన్‌లోని మాధోపూర్‌లో ఉన్న సిక్స్‌సెన్సెస్‌ ఫోర్ట్‌ భర్వారాలో పంజాబీ సంప్ర‌దాయం ప్ర‌కారం వీరి వివాహ‌ వేడుక అత్యంత ఘ‌నంగా జ‌ర‌గ‌బోతోంది. దానికంటే ముందు 7న నిశ్చితార్ధం, 8న మెహందీ, సంగీత్ వేడుక‌లు జ‌రుగుతాయి.

వివాహ వేడుకలకోసం ఇప్పటికే కత్రినా కైఫ్ విక్కీ కౌశల్‌లు ముంబై నుంచి రాజస్థాన్‌కు చేరుకున్నారు. ఇదిలా ఉంటే..విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ ఇద్ద‌రూ త‌మ‌కు అత్యంత సన్నిహితంగా ఉండే వారిని మాత్రమే వివాహానికి ఆహ్వానించార‌ట‌. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సీనియ‌ర్‌ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్‌కు ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది.

వెంకటేష్ హీరోగా తెర‌కెక్కిన‌ ‘మల్లీశ్వరి’ చిత్రంతోనే కత్రినా టాలీవుడ్ కి పరిచయమయ్యింది. ఈ సినిమా మంచి విజ‌యం సాధించ‌డంతో కత్రినా తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైంది. అదే స‌మ‌యంలో వెంకీ- క‌త్రినాల మ‌ధ్య మంచి స్నేహ బంధం కూడా ఏర్ప‌డింది. అందుకే గెస్ట్‌ల లిస్ట్‌లో వెంకీ పేరును చేర్చిన క‌త్రినా.. ఇప్ప‌టికే ఆయ‌న‌కు ప్రత్యేకంగా మ్యారేజ్ ఇన్విటేషన్‌ను కూడా పంపింద‌ని తెలుస్తోంది. దీంతో క‌త్రినా కైఫ్, విక్కీ కౌశ‌ల్‌ల‌ పెళ్లికి వెళ్తున్న ఏకైక టాలీవుడ్ హీరో వెంకీనే అయ్యారు.

కాగా, 2019 నుంచి నటుడు విక్కీ కౌశల్ కత్రినా కైఫ్‌లు ప్రేమలో ఉన్నారు. కానీ, వీరిద్దరూ తమ బంధం గురించి ఎప్పుడూ నోరు విప్పలేదు. అయితే ఎక్క‌డికి వెళ్లినా జంట‌గా వెళ్ల‌డం, కత్రినా ఫ్లాట్ వద్ద అర్దరాత్రి విక్కీ కౌశల్ త‌ర‌చూ క‌నిపిస్తుండ‌టంతో వీరి ప్రేమాయ‌ణం బ‌య‌ట‌కు వ‌చ్చి.. చివ‌ర‌కు పెళ్లి దాకా దారి తీసింది.