రెబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్నాడు. ఇప్పటికే రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంతో ఈయన నటించిన రాధేశ్యామ్ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరోవైపు ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్`, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్` మరియు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో `ప్రాజెక్ట్ కె` చిత్రాలు చేస్తున్నాడు.
వీటిల్లో ఆదిపురుష్ షూటింగ్ పూర్తి కాగా.. మిగతా రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నారు. అయితే ఒక్కో సినిమాకు వంద కోట్ల వరకు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్న ప్రభాస్.. తాజాగా హైదరాబాద్లో ఓ కొత్త ఇంటిని కట్టబోతున్నాడట. ఇప్పటికే హైదరాబాద్, ముంబైలలో ఈయనకు ఖరీదైన బంగ్లాలు ఉండగా.. ఇప్పుడు హైదరాబాద్లోని నానక్రామ్గూడ సినీ విలేజ్లో మరో పెద్ద విల్లాను నిర్మించబోతున్నాడట.
ఇందులో భాగంగానే ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉంటుందనీ, ట్రాఫిక్ పెద్దగా వుండని ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో ప్రభాస్ రూ.120 కోట్ల ఖర్చుతో రెండు ఎకరాలు కొనుగోలు చేశారట. అక్కడ రూ.80 కోట్లతో విలాసవంతమైన ఇంటిని తనకు నచ్చినట్టుగా నిర్మించాలనుకుంటున్నాడట. ఇందుకోసం మొత్తం బడ్జెట్ 200 కోట్ల వరకు అవుతుందని అంటున్నారు.
మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ మ్యాటర్ తెగ వైరల్ అవుతోంది. కాగా, వరుస సినిమాతో దూసుకుపోతున్న ప్రభాస్.. ఇటీవల తన 25వ చిత్రాన్ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రానికి `స్పిరిట్` అనే టైటిల్ను ఖరారు చేశారు. వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతోంది.