పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అనుష్కల జోడీగా ఎంత చూడముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలతో టాలీవుడ్లో బెస్ట్ ఆన్ స్క్రీన్ జోడీగా పేరు తెచ్చుకున్న ప్రభాస్-అనుష్కలు.. నిజజీవితంలోనూ జంటగా మారబోతున్నారని ఇప్పటికే రకరకాల కథనాలు తెరపైకి వచ్చాయి.
వారిద్దరూ పెళ్లి చేసుకుంటూ చూడాలని అభిమానులు సైతం తెగ ముచ్చటపడుతున్నారు. కానీ, ప్రభాస్- అనుష్కలు మాత్రం ప్రేమ, పెళ్లి ఏం లేదని.. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఇకపోతే ప్రభాస్ సినిమా నుంచి వచ్చిన ప్రతి అవకాశానికి ఓకే చెప్పిన అనుష్క.. ఒకే ఒక్క సినిమాను మాత్రం రిజెక్ట్ చేసింది.
ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు.. `రెబల్`. రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శ్రీ బాలాజీ సినీ మీడియా పతాకంపై నిర్మితమైంది. మిల్కీ బ్యూటీ తమన్నా, దీక్షాసేథ్ హీరోయిన్లుగా నటించగా.. లెజెండ్రీ నటుడు కృష్ణం రాజు కీలక పాత్ర పోషించారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా నటించాలని మొదట అనుష్కనే మేకర్స్ సంప్రదించారట.
కానీ, అదే సమయంలో ఇతర సినిమాలతో బిజీగా ఉండటం కారణంగా అనుష్క రెబల్ చిత్రాన్ని రిజెక్ట్ చేసిందట. దాంతో అనుష్కకు బదులుగా తమన్నాను మేకర్స్ తీసుకున్నారు. అయితే భారీ అంచనాల నడుమ 2012 సెప్టెంబరు 28 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ఫ్లాప్ టాక్ను మూటగట్టుకుంది.