బిగ్ బ్రేకింగ్: ఏపీ మాజీ సీఎం రోశయ్య కన్నుమూత!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య(88) క‌న్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయనకు శ‌నివారం ఉద‌యం బీపీ డౌన్ కావడంతో కుటుంబీకులు హుఠాహుఠిన‌ బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మ‌ధ్య‌లోనే ఆయ‌న తుదు శ్వాస విడిచారు.

ఆయ‌న మ‌ర‌ణాన్ని వైద్యులు నిర్ధారించ‌డంతో.. రోశయ్య పార్ధీవదేహాన్ని తిరిగి కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొని వచ్చారు. దీంతో ప‌లువురు రాజ‌కీయ నాయ‌కులు, సినీ ప్ర‌ముఖులు ఆయ‌న మృతిపై సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. కాగా, 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో జన్మించిన కొణిజేటి రోశయ్య..గుంటూరు హిందూ కళాశాల లో కామర్స్ అభ్యసించారు.

ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరుగా పనిచేసి త‌న‌కంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.