ఈనాటి బంధం ఏనాటిదో.. బాలయ్యపై బన్నీ పొగడ్తల వర్షం..!

బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో అఖండ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగింది. ఈ వేడుకల్లో ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్, రాజమౌళి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ ‘నందమూరి బాలకృష్ణ కుటుంబంతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. ఈనాటి బంధం ఏనాటిదో. ఎన్టీఆర్ తో మా తాతగారికి ఎంతో సాన్నిహిత్యం ఉంది. ఎన్టీఆర్ గారి కిచెన్లోకి అల్లు రామలింగయ్య గారు నేరుగా వెళ్లేవారు.

చిరంజీవి, బాలకృష్ణ గారి సినిమాలు చూస్తూ పెరిగా. బోయపాటికి నేను అంటే ఎంతో గౌరవం. నా ఎదుగుదలను ఇష్టపడతారు. శ్రీకాంత్ నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి. ఆయన మనసు ఎంతో సున్నితం. అలాంటి వ్యక్తి విలనిజం ఎలా చేస్తాడా..అని ఆశ్చర్యపోయా. నిజంగా విస్మయానికి గురి చేసేలా ఆయన పాత్ర పోషించారు.

బాలకృష్ణ గారిలా ఒక పేజీ అయినా.. రెండు పేజీలైనా..మూడు పేజీలయినా..ఒకే తీవ్రతతో డైలాగులు చెప్పడం అందరికీ సాధ్యం కాదు. అఖండ మూవీ భారీ హిట్ అవ్వాలి.’ అని అల్లు అర్జున్ ఆకాంక్షించారు. చివర్లో బన్నీ జై బాలయ్య అంటూ తన ప్రసంగాన్ని ముగించారు. కాగా అఖండ సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.