బాలయ్యతోనే పూనకాలు స్టార్ట్!

కరోనా వైరస్ కారణంగా సినీ ప్రేమికులు దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈమధ్య కాలంలో కరోనా వ్యాప్తి తగ్గడంతో సినిమా థియేటర్లు నెమ్మదిగా తెరుచుకున్నా, ఇంకా పూర్తిస్థాయిలో ఆడియెన్స్ మాత్రం సినిమా థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక ప్రస్తుతం పరిస్థితి మెరుగవడంతో థియేటర్లలో సినిమాలు చూసేందుకు ఆడియెన్స్ ముందుకొస్తున్నారు. దీంతో టాలీవుడ్ దర్శకనిర్మాతలు వరుసగా తమ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసి ఆడియెన్స్‌ను మెప్పించే పనిలో పడుతున్నారు.

ఈ క్రమంలో తెలుగు స్టార్ హీరోలందరూ తమ సినిమా రిలీజ్ డేట్‌లను అనౌన్స్ చేస్తూ స్పీడుమీదున్నారు. కానీ ఇప్పటివరకు అనౌన్స్ చేసిన సినిమాల్లో పూర్తిగా మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసిన సినిమా ఏది అనే ప్రశ్న అందరిలో నెలకొంది. దీంతో టార్చ్‌లైట్ వేసి వెతికితే ఒక్క నందమూరి బాలకృష్ణ నటిస్తున్న అఖండ చిత్రం మాత్రమే పూర్తి మాస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నట్లు సినీ వర్గాలు అంటున్నాయి.

అఖండ చిత్రంలో మాస్ ఆడియెన్స్‌కు కావాల్సినంత స్టఫ్ ఉందని, బోయపాటి శ్రీను మాస్ ఆడియెన్స్ పల్స్‌ను బాగా పట్టుకుంటాడనే నమ్మకం సినీ వర్గాల్లో ఉండటంతో, అఖండ చిత్రం మాత్రమే మాస్ ఆడియెన్స్‌కు పూనకాలు తెప్పించే సినిమా అవుతుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఏదేమైనా బాలయ్య చెప్పే డైలాగులు, ఆయన యాక్షన్ సీన్స్, ఎమోషన్స్ అన్నీ కలగలిసి ఈ సినిమాను మాస్ ట్రీట్‌తో ప్రేక్షకులు మెచ్చే విధంగా చిత్ర యూనిట్ రెడీ చేసింది. మరి అఖండ చిత్రంతో మాస్ ఆడియెన్స్‌కు బాలయ్య ఎలాంటి పూనకాలు తెప్పిస్తాడో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.