ప్లాన్ – బీ అమలు చేసిన అధినేత

చదరంగమైనా.. రాజకీయమైనా ఎత్తులు..పై ఎత్తులు ఉంటాయి.. ప్రత్యర్థి వేసే ఎత్తును ఊహించి మనం స్టెప్ వేయాలి.. లేకపోతే అంతే.. ఒక్కసారిగా చెక్ పడిపోతుంది.. ఆ తరువాత ఎంత ఏడ్చినా ప్రయోజనం ఉండదు. ఇటువంటి విషయాల్లో రాజకీయ ఉద్ధండుడు కేసీఆర్ చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రత్యర్థి వేసే ఎత్తుకు మరో రెండు, మూడు స్టెప్స్ ముందే ఊహించి ప్లాన్ రూపొందిస్తారు. అవే ప్లాన్ -ఏ, ప్లాన్- బీ.. ముందుగా అనుకున్న ప్రకారం ప్లాన్ – ఏ ను అమలు చేస్తారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ ప్లాన్ సక్సెస్ కావాల్సిందే. ప్లాన్ -బీ అవసరం పడదు.. అయితే ఇప్పుడు మాత్రం ప్లాన్ – బీని అమలు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ప్లాన్ – ఏ ఫెయిలైంది కాబట్టి. ఈ ప్లాన్ – ఏ, ప్లాన్ – బీ లు కేసీఆర్ ఎవరి విషయంలో అమలు చేస్తున్నారంటే కౌశిక్ రెడ్డి విషయంలో..

ఈటలను ఎదుర్కొనేందుకే..

హుజూరాబాద్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీచేసి ఓడిపోయిన కౌశిక్ రెడ్డి ఈటల రాజీనామా అనంతరం కారు పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో కౌశిక్ కు కేసీఆర్ ఘనస్వాగతం చెప్పారు. పార్టీలో అతనికి మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఆయన అన్నట్లుగానే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి సిఫార్సు చేస్తూ ఫైల్ పంపించారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. సామాజిక సేవా కార్యకర్తగా కౌశిక్ పేరును పంపడం ఏమిటని రాజ్ భవన్ ఆ ఫైలును పెండింగులో ఉంచింది. దీంతో కేసీఆర్ కు షాక్.. రాజ్ భవన్ లో పరువుపోయే.. కౌశిక్ కు ఇచ్చిన మాట దక్కలే.. దీంతో కౌశిక్ ఫీల్ కాకూడదని ప్లాన్.బీ అమలు చేస్తున్నారు. అదే ఎమ్మెల్యేల కోటాలో మండలికి పంపడం. అసలు కౌశిక్ రెడ్డికి ఎందుకంత ప్రాధాన్యం అంటే.. హుజూరాబాద్ లో ఈటలను భవిష్యత్తులో ఎదుర్కొనేది ఇతనే. నియోజకవర్గంలో గట్టి పట్టున్న నాయకుడు కావడంతో.. భవిష్యత్తులో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఈటలకు దీటుగా ఉంటాడు కాబట్టి… ఇదీ కేసీఆర్ రాజకీయ చతురత.