రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం `ఆర్ఆర్ఆర్` సంక్రాంతి బరిలో దిగుతుండడంతో.. మిగిలిన హీరోలు తమ సినిమాలను వాయిదా వేసుకుంటున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, డైరెక్టర్ పరుశురామ్ కాంబోలో తెరకెక్కుతున్న `సర్కారు వారి పాట` చిత్రాన్ని జనవరి 13 నుంచీ ఏప్రిల్ 1వ తేదీకి వాయిదా వేశారు.
అయితే ఇప్పుడు మహేష్ బాటలోనే పవన్ కూడా నడవబోతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం `భీమ్లా నాయక్`. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
కానీ, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఆ సమయానికి విడుదలకు సిద్ధం అవ్వడంతో.. భీమ్లా నాయక్ను ఫిబ్రవరి 25న రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఎంత వరకు నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.