తెలంగాణపై జనసేనాని దృష్టి..కేసీఆర్ ను టార్గెట్ చేస్తారా?

చిరంజీవి క్రియాశీల రాజకీయాల్లోంచి తప్పుకున్న అనంతరం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని సంగతి తెలిసిందే. పార్టీ స్థాపించినప్పటి నుంచీ ఆయన ఏపీపైనే ఫోకస్ చేశారు. సభలు, సమావేశాలు, పార్టీ కార్యక్రమాలు, మేధావులతో చర్చలు.. ఇలా అన్నీ ఏపీ కేంద్రంగానే సాగాయి. మరెందుకో పవన్ కల్యాణ్ తెలంగాణలో పార్టీ గురించి ఆలోచించడం లేదు. పవన్ కల్యాణ్ కు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా యూత్ పవన్ మాటలకు బాగా కనెక్ట్ అవుతారు. దీనిని దృష్టిలో ఉంచుకునే పవన్ ప్రసంగాలు కూడా చేస్తారు. అయితే ఇన్నేళ్లుగా తెలంగాణ గురించి ఆలోచించని జనసేన అధినేత ఇప్పుడు టి.జేఎస్పీ గురించి ఆలోచిస్తున్నారు. తెలంగాణలో కూడా పార్టీ క్రియాశీలకంగా ఉండాలని, ముఖ్య పాత్ర పోషించాలని పలువురు పవన్ తో చెప్పినట్లు సమాచారం.

ముఖ్యంగా యువత రాజకీయాల్లో పాలు పంచుకోవడానికి ఆసక్తిగా ఉందని అధినేతతో చెప్పినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అందుకే హైదరాబాదులో ఈనెల 9న పార్టీ సమావేశం నిర్వహించనున్నారు పవన్ కల్యాణ్. అజీజ్ నగర్ లోని జేపీఎల్ కన్వెన్షన్ లో పార్టీ మీటింగ్ జరుగనుంది. తెలంగాణ శాఖ పార్టీ సమావేశంలో కార్యకర్తలకు, నాయకులకు పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీని ముందుకెలా తీసుకెళ్లాలి? సంస్థాగత నిర్మాణం ఎలా చేపట్టాలి? ప్రజల పక్షాన నిలిచి పోరాడేందుకు ఎటువంటి పథకాలు రూపొందించాలి? అనే విషయాపై పవన్ కూలంకుషంగా చర్చిస్తారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు కూడా తీసుకుంటారు. ఈ సమావేశం నిర్వహణను పార్టీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిసింది. పవన్ కల్యాణ్ కు ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకొని రాష్ట్రంలో బలపడాలని పార్టీ మేధావులు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. మరి 9న జరిగే సమావేశంలో పవన్ ఏం ప్రసంగిస్తారో అనేదే ఇపుడు చర్చ. అధికార పార్టీని ఏపీలో దుమ్మెత్తి పోసే పవన్.. మరి తెలంగాణలో కేసీఆర్ జోలికి వస్తాడా అనేది వేచి చూడాల్సిందే.