పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్, దర్శకురాలు రేణూ దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మోడలింగ్ రంగంలో నుంచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రేణూ.. తమ మొదటి సినిమా హీరో అయిన పవన్ను ప్రేమ వివాహం చేసుకోవడం, విడాకులు తీసుకోవడం, ఆ తర్వాత తన ఇద్దరు పిల్లలను తీసుకుని పూణెకు వెళ్లిపోవడం అంతా తెలిసిందే.
ఇక లాంగ్ గ్యాప్ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన రేణూ.. ప్రస్తుతం టీవీ షోలతో పాటుగా పలు వెబ్ సిరీస్లు చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ ఉండే రేణూ దేశాయ్.. వృత్తిపరమైన విషయాలతో పాటుగా వ్యక్తిగత విషయాలను షేర్ చేస్తుంటుంది. అలాగే సామాజిక అంశాలపై సైతం స్పందిస్తుంటుంది. అయితే తాజాగా జంతు పరిరక్షణకు సంబంధించిన ఓ సంస్థ చేసిన పోస్ట్ను రేణూ దేశాయ్ తిరిగి షేర్ చేస్తూ.. తాను వేగన్(శాకాహారి)గా మారిపోవడానికి కారణం ఏంటో చెప్పుకొచ్చింది.
`నేడు వేగన్గా మారిపోయాను. ఎందుకంటే, ఓ జంతువు జీవితకాలం మొత్తాన్ని, దాని భయం, దాని బాధ, నొప్పి ఇవన్నీ కూడా కేవలం నా 15 నిమిషాల సుఖం, సంతోషానికి సరితూగదు. ఆ విషయాన్ని నేను రియలైజ్ అయ్యాను. అందుకే జంతు హింస నేను చేయలేను` అంటూ తన పోస్ట్లో రాసుకొచ్చింది. కాగా, ఈ మధ్య జీవ హింసకు వ్యతిరేకంగా, మూగ జీవుల హక్కులను గుర్తిస్తూ, వాటిపై అవగాహన తెచ్చుకుని చాలా మంది మాంసాహారాన్ని వదిలేస్తున్నారు. అయితే ఈ లిస్ట్లో రేణూ కూడా ఒకరు.