బుల్లితెర రియాలిటీ షో బిగ్బాస్ సీజన్ 5లో మూడు వారం కొనసాగుతోంది. గడిచిన రెండు వారాల్లో సరయు, ఉమాదేవి ఎలిమినేట్ కాగా..హౌస్లో ఇంకా 17 మంది ఉన్నారు. ఇదిలా ఉంటే.. తాజా ఎపిసోడ్లో తొలి ప్రేమను తలుచుకునే అవకాశాన్ని బిగ్బాస్ కంటెస్టెంట్లకు కల్పించాడు. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్ కోటాలో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్ తన ప్రేమ గురించి చెబుతూ ఎమోషనల్ అయింది.
ప్రియాంక మాట్లాడుతూ.. `ఒక ఫంక్షన్లో రవి అనే అబ్బాయిని చూశాను. అక్కడే పరిచయం అయింది. పరిచయం అయిన కొన్ని రోజులకే ఒకర్నొకరు అర్థం చేసుకున్నాం. నా పరిస్థితి తెలిసి నాకు అతడెంతో ధైర్యం చెప్పేవాడు. ఇద్దరం బాగా క్లోజ్ అయ్యాం. దాదాపు ఆరేళ్లు రిలేషన్లో ఉన్నాం. నాకు ఓ తోడు దొరికిందని సంబరపడిపోయా. ఆ తర్వాత నేను నా జెండర్ని ఛేంజ్ చేసుకుని.. అతడిని కలిసి నువ్వంటే నాకిష్టమని చెప్పి పెళ్లి చేసుకుందామని కోరాను.
అతడు సరేనన్నాడు. దాంతో మేము మరింత దగ్గర అయ్యాము. కానీ కొన్ని రోజుల తర్వాత రవి ఇంటికి వచ్చి నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, చేసుకుంటాను అని చెప్పాడు. నాతో పెళ్లికి ఓకే అన్నావు కదా అన్న విషయాన్ని గుర్తు చేస్తే నువ్వేమైనా అమ్మాయివా? నీకేమైనా పిల్లలు పుడతారా? ఏం మాట్లాడుతున్నావు? పెళ్లంటావేంటి? ఉన్ననాళ్లు ఉందాం అంటూ చిరాకు పడ్డాడు. దాంతో నేను తట్టుకోలేకపోయాను. నాకూ అమ్మ కావాలని ఉంది, అందుకోసం చాలా ఆసుపత్రులు తిరిగి కొన్ని లక్షలు ఖర్చు పెట్టాను. కానీ, అది సాధ్యం కాలేదు.
మరోవైపు తనను వదిలేయవద్దని రవి కాళ్లు పట్టుకుని ఏడ్చాను. అతడు వెళ్లిపోతుంటే ఆయన బండి వెనకాల పరిగెత్తాను, కానీ తన దారి తనే చూసుకుని నన్ను మోసం చేశాడు. వాడుకుని నడి రోడ్డుపైనే వదిలేశాడు. అయినప్పటికీ అతడు హ్యాపీగా ఉంటే చాలు. అతడి సంతోషమే నాకు కావాలి.` అంటూ చెప్పుకొచ్చింది.