సురేందర్ రెడ్డితో పవన్ చేయబోయేది అలాంటి సినిమానా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఇప్పటికే చివరిదశ షూటింగ్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్ హిట్ మూవీ ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’కు తెలుగు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తనదైన సత్తా చాటేందుకు పవన్ రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా తరువాత పవన్ వరుసబెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ చేయబోయే సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను ఇటీవల పవన్ పుట్టినరోజు కానుకగా చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ సినిమా నేపథ్యంలో ఏమిటో ఓ పోస్టర్ రూపంలో తెలిపే ప్రయత్నం చేశారు చిత్ర యూనిట్. హైదరాబాద్ నగరంపై ఓ తుపాకి ఎక్కుపెట్టి ఉన్న పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో ‘యథా కాలమ్ తథా వ్యవహారమ్’ అనే వ్యాఖ్యం ఉండటంతో ఈ సినిమా ఎలాంటి నేపథ్యంలో రాబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. అయితే ఈ సినిమా పూర్తిగా క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. గతంలో పవన్ బాలు, పంజా లాంటి సినిమాలు చేసినా అవి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

దీంతో ఇప్పుడు మరోసారి పవన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీతో రిస్క్ చేస్తున్నాడా అని అందరూ అనుకుంటున్నారు. అయితే సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో రాబోయే సినిమా కావడంతో ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఇక పవన్ నుండి కూడా ప్రేక్షకులు కొత్త తరహా చిత్రం కోరుతుండటంతో ఈ సినిమా అన్ని విధాలుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని పవన్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో పవన్ చేయబోయే సినిమా ఎలాంటి కథతో వస్తుందో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.