కరోనా వచ్చినప్పటి నుంచీ పేద ప్రజలకు అండదండగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సినీ నటుడు సోనూసూద్.. రూ. 20 కోట్లకు పైగా పన్ను ఎగ్గొట్టినట్టు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. గత మూడు రోజులగా సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
అయితే శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఓ ఆదాయపు పన్ను శాక అధికారి.. సోనూసూద్ మరియు అతని సహచరులు రూ. 20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు తెలిపారు. పన్ను ఎగవేతకు సంబంధించిన నేరపూరిత ఆధారాలన్నీ సోనూసూద్ కార్యాలయాల్లో లభించాయని స్పష్టం చేశారు. బాలీవుడ్ సినిమాల నుంచి వచ్చే పేమెంట్లతో పాటు ఆయన వ్యక్తిగత ఆదాయంలో పన్ను ఎగవేతకు పాల్పడినట్లు తెలుస్తోంది.
అయితే మరోవైపు సోనూసూద్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ఆయన ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరుగుతుండడంతో బీజేపీపై ప్రతిపక్ష పార్టీల నేతలు భగ్గుమంటున్నాయి. ప్రజలకు సేవ చేస్తున్న సోనూసూద్పై కావాలనే నిందలు మోపుతున్నారని మండిపడుతున్నారు.