ఉప్పెన హీరో కూడా లైన్ కట్టాడు!

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ నుండి చాలా మంది హీరోలు వచ్చి బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫ్యామిలీ నుండి కొత్తగా వచ్చిన హీరో వైష్ణవ్ తేజ్ తన తొలి చిత్రం ‘ఉప్పెన’తో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాను సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సానా అద్భుతంగా తెరకెక్కించడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచి వైష్ణవ్ తేజ్‌కు అదిరిపోయే ఎంట్రీని ఇచ్చింది. ఇక వైష్ణవ్ తేజ్ నటిస్తున్న నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ క్రిష్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాను పూర్తిగా అడవి బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిస్తున్నట్లు చిత్ర యూనిట్ గతంలో వెల్లడించింది. అందుకే ఈ సినిమా మెజారిటీ షూటింగ్ వికారాబాద్ అటవీ ప్రాంతంలో చిత్రీకరించారు. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుందని, త్వరలోనే మిగతా షూటింగ్‌ను కూడా ముగించేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. అంతేగాక ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో కూడా చిత్ర యూనిట్ ఓ క్లారిటీకి వచ్చేసిందట.

వినాయక చవితి కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 8న రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయినట్లు చిత్రపురిలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ‘కొండపొలం’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చిత్ర యూనిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరి రెండో సినిమాతో వైష్ణవ్ తేజ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.